సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ ను ఒంటరిని చేసేశారని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఈ అంశం గోటితో పోయేది గొడ్డలి దాకా తెచ్చుకోవడమేనని స్పష్టం చేశారు. సినిమాపై ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని, అభిమానులకు అభివాదం చేయాలని ప్రతి హీరోకు ఉంటుందని, కానీ, థియేటర్ వెళ్లే ముందు ఏర్పాట్లు చేసుకోవాల్సిందని ఆయన చెప్పారు.
సారీ చెప్పడానికి పలు విధానాలు ఉంటాయని పేర్కొంటూ ఘటన జరిగిన రెండో రోజే బాధితులను పరామర్శించాల్సిందని పవన్ పేర్కొన్నారు. అల్లు అర్జున్ వెళ్లకపోయినా కనీసం చిత్ర యూనిట్ అయినా బాధితుడి ఇంటికి వెళ్లి ఉండాల్సిందని తెలిపారు. అల్లు అర్జున్ విషయంలో ఎక్కడో మానవతా దృక్పథం లోపించిందని చెప్పారు.
అందరూ రేవతి ఇంటికి వెళ్లి భరోసా ఇచ్చి ఉండాల్సిందని, అది చేయకపోవడం వల్లే ఇంతవరకు వచ్చిందని తెలిపారు. “సినిమా అంటే టీం… అందరూ భాగస్వామ్యం ఉండాలి. ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చారు. ఇది కరెక్ట్ కాదని నా అభిప్రాయం’’ అని పవన్ పేర్కొన్నారు.
“తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమతో గౌరవం, మర్యాదతో వ్యవహరించింది. పుష్ప2 సినిమాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా ప్రోత్సాహం ఇచ్చింది. స్పెషల్ షోలు, టికెట్ రెట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఈ విషయంతో ఏం చేయాలన్నా రెండు వైపుల పదునున్న కత్తిలా రేవంత్ రెడ్డి పరిస్థితి మారింది. అల్లుఅర్జున్ అనే కాదు ఎవరి విషయంలోనైనా రేవంత్ విధానం ఒకటేనని, చట్టం కూడా ఎవరిని విడి విడిగా చూడదు” అని పవన్ స్పష్టం చేశారు.
‘‘మేము సినిమా థియేటర్కు వెళ్లడం ఎప్పుడో మానేశాము. ఇటువంటి ఘటనల్లో పోలీసులను నేను ఎందుకు తప్పు పట్టను అంటే వారు ముందు భద్రత గురించి ఆలోచన చేస్తారు. విజయనగరంలో నన్ను కూడా ముందు వద్దనే చెప్పారు. చిరంజీవి ముసుగు వేసుకుని ఒక్కరే థియేటర్కు వెళ్లేవారు. నేనూ అలాగే వెళ్లిన సందర్భాలు ఉన్నాయి” అని తెలిపారు.
“ఈ విషయంలో స్టాఫ్ అర్జున్కు ముందు చెప్పి ఉండాల్సింది. ఆయన వెళ్లి కూర్చున్నాక ఘటన గురించి చెప్పి తీసుకెళ్లాల్సింది. చట్టం అందరికీ సమానం. అర్జున్కు చెప్పి ఉన్నా ఒక్కోసారి ఆ అరుపుల్లో అతనికి వినిపించలేదేమో” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
More Stories
ఖమ్మంలో సీపీఎం నేత దారుణ హత్య
అజారుద్దీన్కు మంత్రిపదవితో కాంగ్రెస్ లో అసమ్మతి కుంపటి!
ప్రభుత్వ నిర్లక్ష్యంతో ధాన్యం తడిచి రైతులు విలవిల