కెనడా ప్రధాని ట్రుడోకు పదవీ గండం

కెనడా ప్రధాని ట్రుడోకు పదవీ గండం
ఇంటా.. బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడోకు పదవీగండం పొంచిఉన్నది. ఇప్పటికే ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్‌ తన పదవికి రాజీనామా చేసి ట్రుడోకు షాకివ్వగా, తాజాగా మిత్రపక్షమైన న్యూ డెమోక్రటిక్‌ పార్టీ నుంచి గట్టి దెబ్బే తగిలేట్లుంది. ట్రుడో నేతృత్వంలోని లిబరల్‌ ప్రభుత్వంపై అవిశ్వాసానికి సిద్ధమవుతున్నది. 
 
శీతాకాల విరామం ముగిసిన వెంటనే హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో జనవరి 27న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ఖలిస్థానీ మద్దతుదారు, ఎన్‌డీపీ నేత జగ్మిత్‌ సింగ్‌ ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. ఆ తీర్మానానికి అన్ని పార్టీలు మద్దతిచ్చినట్లయితే 9 ఏండ్ల ట్రుడో పాలనకు ముగింపు పలికినట్లే కాగలదు.

ట్రూడో పార్టీకి చెందిన లిబరల్ ఎంపీలు కనీసం 20 మంది ఆయన వైదొలగాలని  కోరుకొంటున్నారు. అయితే ఆయన మంత్రివర్గం ఆయనకు మద్దతు ఇస్తుంది.

లిబర్‌ పార్టీ నాయకుడు ఎవరనేది తమకు ప్రదానం కాదని, ఈ ప్రభుత్వానికి గడువు ముగిసిందని జగ్మిత్‌ సింగ్‌ చెప్పారు. తదుపరి సమావేశాల్లో హౌస్‌ కామన్స్‌లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతామని వెల్లడించారు. ప్రధాని పదవిని సమర్థవంతంగా నిర్వహించడంలో ట్రుడో విఫలమయ్యారని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయారని విమర్శించారు.

ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఎన్‌డీపీ ఓటు వేస్తుందని, తమ కోసం పనిచేసే కొత్త సర్కారును ఎన్నుకోవడానికి కెనడా ప్రజలకు అవకాశం ఇస్తామని తెలిపారు. శీతాకాల విరామం ముగిసిన వెంటనే హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో జనవరి 27న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రకటించారు. ట్రూడో తన పదవికి రాజీనామా చేయాలని ఆయన ఇప్పటికే డిమాండ్ చేశారు. 

దేశంలో తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉన్నాయని, ఇండ్లు, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడం, ట్రంప్ భారీ టారీఫ్ లు విధిస్తామని హెచ్చరించడంతో దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. జగ్మీత్‌కు తోడు ఆ దేశంలోని మెజార్టీ ప్రజల నుంచి ప్రధాని పదవి నుంచి ట్రుడో వైదొలగాలన్న డిమాండ్ రోజురోజుకు అధికమవుతున్నది.

కాగా, జగ్మీత్ సింగ్ ఖలిస్థానీ వేర్పాటు వాదానికి బలమైన మద్దతుదారు. వచ్చే ఏడాదిలో కెనడాలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయనను ప్రసన్నం చేసుకోవడానికే భారత్‌పై ట్రుడో అసత్యాలు ప్రచారం చేస్తూ విభేదాలను పెద్దవి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ట్రూడోపై గతంలో అవిశ్వాస తీర్మానం పెట్టిన సమయంలో ప్రభుత్వం కూలిపోకుండా ఎన్‌డీపీ మద్దతు ఇచ్చింది. దీంతో అవిశ్వాస గండం నుంచి ట్రూడో గట్టెక్కగలిగాడు. ఇప్పుడు ట్రుడో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని జగ్మీత్ సింగ్ ప్రకటించడం గమనార్హం.