ప్రియాంక గాంధీ `పాలస్తీనా’ బ్యాగ్ పై దుమారం

ప్రియాంక గాంధీ `పాలస్తీనా’ బ్యాగ్ పై దుమారం
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ పార్లమెంటు సభ్యురాలైన కొద్దీ రోజులకే వివాదాలలో చిక్కుకుంటున్నారు. సోమవారంనాడు పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు ఒక అందమైన బ్యాగుతో ప్రియాంక వచ్చారు. దానిపై ‘పాలస్తీనా’  అనే రాతలు ఉండటం, ఆ ఫోటోను కాంగ్రెస్ ప్రతినిధి డాక్టర్ షామ మహమ్మద్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్ట్ చేయడం వివాదానికి దారితీసింది. 

దయ, న్యాయనిబద్ధత, మానవత్యానికి ఇది సంకేతమని, జెనీవా కన్వెన్షన్‌ను ఎవరూ ఉల్లంఘించరాదనే సందేశం ఇందులో ఉందని ఆమె పేర్కొన్నారు. కాగా, ఇది ముస్లింలను బుజ్జగించే చర్యగా బీజేపీ ఘాటు విమర్శలు గుప్పించింది.

ప్రియాంక గాంధీ ఒక ప్రత్యేక బ్యాగుతో పాలస్తీనాకు తన సంఘీభావం తెలిపినట్టు ఒక నెజిజన్ వ్యాఖ్యానించారు. అయితే, తూర్పు పాకిస్థాన్‌పై మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాకిస్థాన్ శక్తులను ఓడించిన ‘విజయ్ దివస్’ రోజు హమాస్ వంటి ఉగ్రవాద సంస్థలకు ప్రియాంక మద్దతు చెప్పడం మంచి అభిరుచి కాదని మరొకరు విమర్శించారు. పాక్‌పై భారత్ విజయాన్ని ప్రతిబింబించే అంశంతో ప్రియాంక వచ్చి ఉంటే బాగుండేదని ఇంకొకరు అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఇందిరాగాంధీ మనుమరాలు అయిన ప్రియాంక గతంలో కూడా గాజాపై ఇజ్రాయెల్ చర్యను వ్యతిరేకిస్తూ పాలిస్తీనీయులకు సంఘీభావం ప్రకటించారు. కేరళలోని వయనాడ్‌లో ప్రియాంక గాంధీ గెలుపు అనంతరం ఢిల్లీలోని పాలస్తీనా కార్యాలయ ప్రతినిధి అబెడ్ ఎల్రాజెగ్ అబు జజెర్ ఆమెను ఇటీవల ఇటీవల ప్రత్యేకంగా కలిసి అభినందించారు. 

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై గత జూలైలో ప్రియాంక విమర్శలు గుప్పిస్తూ, గాజాలో ఇజ్రాయెల్ ప్రభుత్వం నరమేథం సాగిస్తోందని తప్పుపట్టారు. యూఎస్ కాంగ్రెస్‌లో ఇజ్రాయెల్ చర్యను సమర్ధించుకుంటూ నెతన్యాహు ఉపన్యసించిన వెంటనే ప్రియాంక ఈ వ్యాఖ్యలు చేశారు. గాజాలో జరుగుతున్న ఊచకోతలకు పౌరులు, తల్లులు, తండ్రులు, వైద్యులు, నర్సులు, సహాయక వర్కర్లు, పాత్రికేయులు, టీచర్లు, రచయితలు, సీనియర్ సిటిజన్లు, వేలాది మంది అమాయక పిల్లలు ప్రతిరోజూ ప్రాణాలు కోల్పోతున్నారని ఆమె విమర్శించారు.

 విద్యేషం, హింసను ఇష్టపడని ఇజ్రాయెల్ పౌరులతో సహా, ప్రతి ఒక్కరికి ఈ నరమేథాన్ని ఖండిచాల్సిన నైతిక బాధ్యత ఉందని ఒక ట్వీట్‌లో ఆమె పేర్కొన్నారు. నాగరికత, నైతికతకు కట్టుబడే ప్రపంచంలో ఇజ్రాయెల్ చర్యలు ఆమోదయోగ్యం కావని ఆమె స్పష్టం చేశారు.