అమృత్ భార‌త్ స్కీమ్ కింద కాజీపేట రైల్వే స్టేష‌న్ అభివృద్ధి

అమృత్ భార‌త్ స్కీమ్ కింద కాజీపేట రైల్వే స్టేష‌న్ అభివృద్ధి

* రైల్వే సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

కాజీపేట రైల్వే స్టేష‌న్‌ను అమృత్ భార‌త్ స్టేష‌న్ స్కీమ్ కింద అభివృద్ధి చేస్తున్న‌ట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ తెలిపారు. లోక్‌స‌భ‌లో ఇవాళ ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇస్తూ ఆయ‌న ఈ విష‌యాన్ని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 70 రైల్వే స్టేష‌న్ల‌ను ఆధునీక‌రిస్తున్నామ‌న్నారు. దాంట్లో కాజీపేట రైల్వే స్టేష‌న్ కూడా ఉన్న‌ట్లు చెప్పారు.

తెలంగాణ‌కు రైల్వే నిధుల కేటాయింపు పెంచిన‌ట్లు మంత్రి చెప్పారు. ఆ రాష్ట్రానికి రికార్డు స్థాయిలో 5336 కోట్లు ఇచ్చిన‌ట్లు ఆయ‌న తెలిపారు. యూపీఏ పాల‌న స‌మ‌యంలో ఉమ్మ‌డి రాష్ట్రానికి కూడా ఆ స్థాయిలో నిధులు రాలేద‌న్నారు. గ‌తంలో తెలంగాణ‌, ఆంధ్ర‌కు క‌లిపి కేవ‌లం 866 కోట్లు ఇచ్చిన‌ట్లు ఆయ‌న చెప్పారు. కేవ‌లం నిధుల కోసమే విభ‌జ‌న సృష్టించ‌డం స‌రికాదు అని మంత్రి తెలిపారు.

కాజీపేట రైల్వే స్టేష‌న్‌ను డివిజ‌న్‌గా డెవ‌ల‌ప్ చేస్తున్నారా అని వ‌రంగ‌ల్ ఎంపీ క‌డియం కావ్య ప్ర‌శ్న వేశారు. ప్ర‌పంచంలోనే అతిపెద్ద రైల్వే రీడెవ‌ల‌ప్మెంట్ ప్రాజెక్టును మోదీ స‌ర్కారు చేప‌ట్టిన‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. దేశ‌వ్యాప్తంగా 1300 స్టేష‌న్ల‌ను అభివృద్ధి చేస్తున్నామ‌ని, చెన్నైలోని ఎగ్మోర్ రైల్వే స్టేష‌న్‌ను కూడా అమృత్ భార‌త్ స్కీమ్ కింద డెవ‌ల‌ప్ చేస్తున్న‌ట్లు చెప్పారు.

కాగా, విపక్ష ఎంపీల ఆందోళనల నడుమే రైల్వే సవరణ బిల్లు-2024కు లోక్‌సభ ఆమోదించింది. ఈ ఏడాది ఆగస్టు 9న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల సందర్భంగా రైల్వే సవరణ బిల్లును రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆ బిల్లుకు బుధవారం ఆమోదముద్ర పడింది.

రైల్వే సవరణ బిల్లు చట్టంగా మారితే రైల్వేల ప్రైవేటీకరణకు దారితీస్తుందని విపక్ష పార్టీల ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే బిల్లుకు వ్యతిరేకంగా వారు సభలో నినాదాలు చేశారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా ఈ బిల్లుతో రైల్వేల ప్రైవేటీకరణ జరగదని, రైల్వే బోర్డు పనితీరు మెరుగుపడుతుందని మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్పష్టం చేశారు.