లింగాయత్‌ల కోటా పోరుపై పోలీసుల లాఠీచార్జి

లింగాయత్‌ల కోటా పోరుపై పోలీసుల లాఠీచార్జి
కర్ణాటకలో తమకు రిజర్వేషన్‌ కోటాను పెంచాలని కోరుతూ లింగాయత్‌ పంచమశాలి శాఖ మఠాధిపతి బసవజయ మృత్యుంజయ స్వామీజీ సారథ్యంలో నిరసనకారులు చేపట్టిన ఆందోళన మంగళవారం బెళగావిలో హింసాత్మకంగా మారింది. శీతాకాల సమావేశాలు జరుగుతున్న అసెంబ్లీని ముట్టడించేందుకు నిరసనకారులు ప్రయత్నించగా వారిని చెదరగొట్టేందుకు పోలీసలు లాఠీచార్జి చేశారు.
 
తమ డిమాండ్లను నెరవేర్చని పక్షంలో అసెంబ్లీని దిగ్బంధిస్తామని హెచ్చరిస్తూ ఆందోళనకారులు విధాన్‌ సౌధకు బయల్దేరడంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు బలప్రయోగం చేశారు. బీజెపీ నాయకులతోపాటు స్వామీజీని పోలీసులు ముందస్తు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రభుత్వ వాహనాలతోపాటు ఎమ్మెల్యేలకు చెందిన వాహనాలను సైతం నిరసనకారులు ధ్వంసం చేశారు.

విద్య, ఉద్యోగ, రంగాల్లో 15 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ లింగాయత్ పంచమసాలి వర్గీయులు ఆందోళనకు దిగారు. వివిధ ప్రాంతాల నుంచి బెళగావికి ర్యాలీగా చేరుకున్న ఆందోళనకారులు, తమ డిమాండ్లను పరిష్కరించకపోతే విధాన సౌధను ముట్టడిస్తామని హెచ్చరించారు. 

ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరిస్థితులు అదుపు తప్పడంతో పోలీస్‌లు లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తరుణంలో తమ డిమాండ్లను పరిష్కరించుకునేందుకు ఇదే సరైన సమయమని ఆందోళనకారులు భావించారు.

మంగళవారం ఓవైపు సమావేశాలు జరుగుతుండగానే పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించుకుంటూ దూసుకుపోయేందుకు యత్నించారు. పలువురు ఉన్నతాధికారుల కార్లను ధ్వంసం చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది. 

 ప్రస్తుతం ఈ సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో 5 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత రిజర్వేషన్లను మరింత పెంచాలని లింగాయత్ పంచమసాలీలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 5 శాతం కోటాను 15 శాతానికి పెంచాలని కోరుతున్నారు.