ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు

ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు
 
* ఏకాభిప్రాయం కోసం ప్రభుత్వ ప్రయత్నం… జెపిసికి నివేదన!
 
దేశంలో జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. లోక్‌సభ, అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు జరిపే రాజ్యాంగ సవరణ బిల్లును శీతాకాల సమావేశాల్లో ప్రవేశ పెట్టాలని నిర్ణయించామని, గురువారం కేంద్ర క్యాబినెట్‌లో ఈ బిల్లును ఆమోదించవచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి. 
 
క్యాబినెట్‌ సమావేశం సాధారణంగా బుధవారం జరగాల్సి ఉండగా ఈసారి గురువారానికి వాయిదా వేశారు. బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత లోక్‌సభ, రాజ్యసభలకు చెందిన సంయుక్త కమిటీకి(జేపీసీ) నివేదిస్తారని, వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో బిల్లు ఆమోదం పొందుతుందని అధికార వర్గాలు తెలిపాయి ఈ మధ్య కాలంలో జేపీసీ వివిధ రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లను సంప్రదిస్తుందన్నారు. 
 
బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రాలకు పంపుతారని, సగానికిపైగా అసెంబ్లీలు ఆమోదించిన తర్వాత అది చట్టరూపం పొందుతుందని అధికార వర్గాలు తెలిపాయి. కాగా, జమిలి ఎన్నికలపై గత ఏడాది సెప్టెంబరులో ఏర్పాటైన రాంనాథ్‌ కోవింద్‌ కమిటీ సిఫారసులను కేంద్ర క్యాబినెట్‌ ఇప్పటికే ఆమోదించింది. 
 
కోవింద్‌ కమిటీకి 47 రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు తెలిపాయి. 32 పార్టీలు జమిలి ఎన్నికలను సమర్థించాయి. బీజేపీ, బీజేడీ, జేడీయూ, శివసేన వీటిలో ఉన్నాయి. వనరులు ఆదా కావడం, సామాజిక సామరస్యాన్ని కాపాడడం, ఏకకాలంలో దేశం అభివృద్ది జరగడం దీనివల్ల సాధ్యపడతాయని అవి భావించాయి. 
 
లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలను ఏకకాలంలో నిర్వహించేందుకు రాజ్యాంగంలోని 83, 172 అధికరణలను సవరించాలని కమిటీ సూచించింది. దీనివల్ల రాష్ట్రపతి, గవర్నర్‌ రద్దు చేస్తే తప్ప లోక్‌సభ, అసెంబ్లీల పదవీకాలం అయిదేళ్లు స్థిరంగా ఉంటుందని కమిటీ భావించింది. బీజేపీ ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో జమిలి ఎన్నికలను ప్రవేశపెడతామని ప్రజలకు హామీ ఇచ్చింది. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇదే అంశాన్ని పదేపదే ప్రస్తావించారు. కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఎంఐఎంతో పాటు అనేక పార్టీలు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాయి. విషయాన్ని జేపీసీకి నివేదించి ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి జేపీసీ ఏర్పాటయితే దాని ద్వారా అన్ని పార్టీల ప్రతినిధులు, మేధావులు, సామాన్యుల అభిప్రాయాలను కూడా సేకరించడానికి అవకాశం కలుగుతుంది. 
 
ప్రస్తుతం ఉన్న ఎన్నికల విధానాన్ని మార్చడం భారీ సవాళ్లతో కూడుకున్న వ్యవహారం కావడంతో పార్లమెంటులో ప్రవేశపెట్టే ముందు బిల్లుపై ఏకాభిప్రాయ సాధన కోసం కేంద్రం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రతిపక్ష పార్టీలతో చర్చలు జరిపే బాధ్యతలను ప్రభుత్వం కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌, కిరణ్‌ రిజిజుకు అప్పగించింది.
 
జమిలి ఎన్నికల బిల్లు ఆమోదం పొందితే ఎప్పుడు ఎన్నికలు జరుగుతాన్న విషయం చర్చ జరుగుతోంది. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉంది కనుక 2029 వరకు ఈ ఎన్నికలకు సన్నద్ధం కావచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పరిస్థితులను బట్టి ఈ ఎన్నికల ప్రక్రియను ముందుకు జరపవచ్చునని కూడా చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం పలు దఫాలుగా ఎన్నికలు జరుగుతుండడంతో సమయం, ధనం వృథా అవుతోందని ప్రభుత్వం భావిస్తోంది. దానికితోడు ఎన్నికల కోడ్‌ వల్ల అభివృద్ధి పనులు చేపట్టడంలో సమస్యలు వస్తున్నాయని అంటోంది. అందువల్ల అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఇది ఆచరణ సాధ్యం కాదని ప్రతిపక్షాలు అంటున్నాయి. 

ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలనే ఎలక్షన్‌ కమిషన్‌ విడతల వారీగా జరుపుతోందని, అలాంటప్పుడు అన్నింటిని ఒకేసారి ఎలా జరపగలుగుతుందని ప్రశ్నిస్తున్నాయి. ఇది అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకమని కూడా వాదిస్తున్నాయి. ఒకే దేశం- ఒకే ఎన్నిక నిర్వహించాలంటే ముందుగా రాజ్యాంగానికి ఆరు సవరణలు చేపట్టాల్సి ఉంది. ఇందుకు ఆరు బిల్లులు ప్రవేశపెట్టాల్సి ఉంది. 

వీటిని పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజార్టీతో ఆమోదించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పార్లమెంటులో ఎన్‌డీఏకు సాధారణ మెజార్టీ ఉందే తప్ప 2/3 మెజార్టీ లేదు. రాజ్యసభలో 245 సీట్లు ఉండగా, ఎన్‌డీఏ బలం 112 మాత్రమే. ప్రతిపక్షాలకు 85 సీట్లు ఉన్నాయి. రాజ్యాంగ సవరణ బిల్లులో ఆమోదం పొందాలంటే 164 ఓట్ల అవసరం ఉంది. 

లోక్‌సభలో మొత్తం 545 స్థానాలు ఉండగా ఎన్‌డీఏకు 292 సీట్లే ఉన్నాయి. 2/3 మెజార్టీ అంటే 364 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. ఇక్కడ చిన్న మెలిక కూడా ఉంది. మొత్తం సభ్యులను పరిగణనలోకి తీసుకోకుండా సభకు హాజరయి, ఓటు వేసిన వారిలో 2/3 శాతం మెజార్టీ సరిపోతుందన్న నిబంధన ఉండడంతో చివరి నిమిషంలో అనూహ్యమైన పరిణామాలకు కూడా అవకాశం ఉంటుంది.