నోయిడా విమానాశ్రయం రన్‌వేపై తొలి విమానం

నోయిడా విమానాశ్రయం రన్‌వేపై తొలి విమానం
నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వేపై తొలి విమానం విజయవంతంగా ల్యాండ్‌ అయ్యింది. సోమవారం మధ్యాహ్నం 1.31 గంటల సమయంలో ఎయిర్‌పోర్ట్‌లోని రన్‌వేపై విమానాన్ని ల్యాండ్‌ చేసిన చరిత్ర సృష్టించింది. ఢిల్లీ నుంచి తొలి వాణిజ్య విమానం కేవలం పది నిమషాల్లోనే నోయిడా ఎయిర్‌పోర్ట్‌లోని ఫ్లయింగ్ జోన్‌కు చేరుకున్నది. 
 
ఒకటిన్నర గంటల పాటు విమానాశ్రయం చుట్టూ చక్కర్లు కొట్టింది. విజయవంతంగా ఫ్లైట్‌ ల్యాండింగ్‌తో రెండున్నర దశాబ్దాల ప్రయత్నాల తర్వాత విమానాశ్రయ చరిత్రలో మరో విజయం నమోదైంది. ఈ సందర్భంగా విమానానికి వాటర్‌ కెనన్‌లతో సెల్యూట్‌ చేశారు.

ఇండిగోకు చెందిన ఏ320 విమానం రన్‌వేపై విజయవంతంగా ల్యాండ్ అయిన సందర్భంలో ప్రభుత్వ సీనియర్‌ అధికారులతో పాటు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి సైతం ఉన్నారు. నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ రన్‌వే ట్రయల్‌కు డీజీసీఏ డిసెంబర్‌ 15 వరకు డెడ్‌లైన్‌ విధించింది. అంతకు ముందు ట్రయల్‌ రన్‌కు నవంబర్‌ 30న నిర్ణయించగ, డీజీసీఏ తనిఖీల నేపథ్యంలో గడువును పొడిగించారు. 

విమానాశ్రయంలో క్యాట్‌-1, క్యాట్‌-3 డివైజెస్‌ను అమర్చారు. దాంతో పొగమంచులో విమానం ఎత్తు, విజిబులిటీ గురించిన సమాచారాన్ని అందిస్తాయి. ఎయిర్‌పోర్ట్‌లో ఇన్‌స్ట్రుమెంట్‌ ల్యాండింగ్‌ సిస్టమ్‌ సైతం ఇన్‌స్టాల్‌ చేశారు. విమానం బీచ్ కింగ్ ఎయిర్ 360 ఈఆర్‌ ద్వారా అక్టోబర్ 10 నుంచి 14 వరకు పరీక్షించారు. దట్టమైన పొగమంచు, చీకట్లో కూడా విమానాలను ల్యాండ్‌ సులభంగా చేసేందుకు వీలుంటుంది.

విమానాశ్రయంలో 3900 మీటర్ల పొడవు, 60 మీటర్ల వెడెల్పుతో తొలి రన్‌వే పూర్తయ్యింది. రన్‌వేపై మార్కింగ్‌, లైటింగ్‌ పనులు పూర్తయ్యాయి. నోయిడా విమానాశ్రయం తొలి దశలో 1,334 హెక్టార్లలో నిర్మిస్తున్నారు. సంవత్సరానికి 1.2కోట్ల మంది ఇక్కడి నుంచి రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంటుంది. 

అయితే, ఈ విమానాశ్రయాన్ని నాలుగు దశల్లో విస్తరిస్తారు. 2050 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే 7కోట్ల మంది సేవలు అందిస్తుంది. త్వరలోనే ఈ ఎయిర్‌పోర్ట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 6వ తేదీ తర్వాత విమాన సర్వీస్‌ల బుకింగ్స్‌ మొదలవనున్నాయి. ఏప్రిల్‌ 17 నాటికి ఎయిర్‌పోర్ట్‌ నుంచి వాణిజ్య విమానాలు ప్రారంభమవుతాయి.