ప్రతి మహిళ కనీసం ముగ్గురిని కనాలి

ప్రతి మహిళ కనీసం ముగ్గురిని కనాలి
“మన దేశంలో జనాభా తగ్గుతుండటం ఆందోళన చెందాల్సిన అంశం. జనాభా శాస్త్రం ప్రకారం సంతానోత్పత్తి రే టు 2.1 మించి దిగువకు వెళ్తే సమాజం నశించే ప్రమాదం ఉంది. అందుకనే ప్రతి మహిళ తన జీవిత కాలంలో ప్రస్తుత రేటు 2.1 కన్నా కనీసం ముగ్గురు పిల్లలకైనా జన్మను ఇవ్వవలసి ఉంటుంది ” అని  రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ సూచించారు. 
 
దేశంలో రానురాను జనాభా తగ్గుతుండటంపై ఆయ న ఆందోళన వ్యక్తం చేశారు. నాగపూర్‌లో ఆదివారం ఆర్‌ఎస్‌ఎస్ నిర్వహించిన ‘ కథ లే కుల్ సమ్మేళన్ ” కార్యక్రమంలో మోహన్ భాగవత్ మాట్లాడుతూ  కుటుంబాల వైశిష్ట్యం గురించి వివరిస్తూ సమాజంలో సంతానోత్పత్తి రేటు 2.1 శాతం కంటే తక్కువగా ఉంటే ఆ సమాజం ఎలాంటి సంక్షోభం అవసరం లేకుండానే  అదృశ్యమవుతుందని ఆధునిక జనాభా శాస్త్రం చెబుతోందని హెచ్చరించారు. 
 
జనాభా తగ్గడం వల్ల అనేక భాషలు, సమాజాలు ఇప్పటికే ఉనికి కోల్పోయాయని ఆయన గుర్తు చేశారు. ‘‘జనాభా శాస్త్రం ప్రకారం జనాభా పెరుగుదల రేటు 2.1 కన్నా దిగువకు వెళ్తే సమాజం నశిస్తుందని చెబుతున్నారు. దానిని ప్రత్యేకంగా ఎవరూ అంతం చేయాల్సిన అవసరం ఉండదు. భారత జనాభా విధానం కూడా జననాల రేటు 2.1 కన్నా తక్కువ ఉండకూదని చెబుతుంది. పైగా మన దేశానికి సంబంధించినంత వరకు ఈ రేటు 3 ఉండాలని సూచిస్తున్నారు. మన సమాజం మనుగడకు ఇది అవసరం” అని డా. భగవత్ స్పష్టం చేశారు.

1960- 2000 మధ్య రెట్టింపైన ప్రపంచ జనాభా పెరుగుదల రేటు ఆ తరువాత నుంచి తగ్గుముఖ పడుతోందని నివేదికలు చెబుతున్నాయి. ప్రతి మహిళ 2.1 మందిని కంటేనే పాతతరాన్ని భర్తీ చేసే స్థాయిలో జననాలు జరుగుతాయి. దీన్ని జనాభా భర్తీ రేటు అంటారు.  ప్రతి మహిళ 2.1 రేటులో పిల్లలని కంటేనే జనాభా భర్తీ జరుగుతుందని చెబుతూ 2.1 కి దరిదాపు రేటులో ఉన్న దేశాల్లో భారత్, అర్జెంటీనా, ట్యునీసియా ఉన్నాయని ఆయన తెలిపారు.  2.1 కన్నా తక్కువ రేటు కలిగిన దేశాల్లో అమెరికా, బ్రెజిల్, మెక్సికో, చైనా, జపాన్, దక్షిణ కొరియా ఉన్నాయని వివరించారు.

1998 లేదా 2002లో భారత జనాభా విధానం రూపొందిందని, 2.1 శాతం కంటే సంతానోత్పత్తి పడిపోకుండా చూడాల్సిన అవసరాన్ని కూడా గుర్తించిందని చెప్పారు. 2021లో విడుదలైన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే డేటా ప్రకారం గర్భనిరోధక రేటు 54 శాతం నుంచి 67 శాతానికి పెరుగుతుండగా, పూర్తి సంతాన శాతం (టిఎఫ్‌ఆర్) రేటు 2.2 నుంచి 2 కు క్షీణించిందని వెల్లడైందని ఆయన గుర్తు చేశారు. 

“మనం కుటుంబాన్ని ఒక సమాజాన్ని రూపొందించే ఒక కీలకమైన విభాగంగా  పరిగణిస్తాము. సంస్కృతి, విలువలు వారసత్వంగా ఒక తరం నుండి మరొక తరానికి అందజేయబడతాయి.  తద్వారా భారతీయులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా కాలానుగుణమైన, సంబంధితమైన ప్రధాన వ్యవస్థలు, విలువలను సంరక్షిస్తాయి” అని ఆయన వివరించారు. వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇవ్వబడిన కొన్ని ఇతర సంస్కృతులు, “భారతీయ సంస్కృతి”కి మనమందరం పరస్పరం అనుసంధానించబడి ఉన్నాయని విశ్వసిస్తుందని తెలిపారు.  

ఎవరైనా ఆకలితో ఉంటే మనమంతా ముందుకు వచ్చి వారికి ఆహారం పెడతాము. మన దరిదాపులకు బిచ్చగాడు వచ్చినా మన కుటుంబంలోని పిల్లల ద్వారా డబ్బు లేదా తిండి గింజలు అందజేస్తాం. ఈ పద్ధతిలో, మనం ఒక తరం నుండి మరొక తరానికి విలువలను అందజేస్తాము. త్యాగం మనకు మూలాధారం, స్వార్థం, స్వార్థం కాదు” అని డా. భగవత్ స్పష్టం చేశారు.

 ఇదిలా ఉండగా, భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక దేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గుతూ వస్తున్నది. 1950 సంవత్సరంలో ఫెర్టిలిటీ రేటు 6.2శాతం కంటే ఎక్కువ ఉండగా, ప్రస్తుతం అది 2.1శాతానికి తగ్గింది. ఇలా కొనసాగితే 2050 నాటికి సంతానోత్పత్తి రేటు 1.3కి పడిపోయే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.