భారత సమాజాన్ని చీల్చడానికి అన్ని మూలలా కుట్రలు

భారత సమాజాన్ని చీల్చడానికి అన్ని మూలలా కుట్రలు
భారత సమాజాన్ని చీల్చడానికి అన్ని మూలలా కుట్రలు జరుగుతున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హెచ్చరించారు. . శిల్పకళా వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మకమైన లోకమంథన్ భాగ్యనగర్ 2024 కార్యక్రమాన్ని జ్యోతిప్రజ్వలన చేసి రాష్ట్రపతి శుక్రవారం ప్రారంభిస్తూ భారతీయ సమాజంలోనే అత్యంత సహజంగా వున్న ఏకత్వ లక్షణాన్ని విచ్ఛిన్నం చేయడానికి, మరి కొందరు భారతీయుల్లో కృత్రిమ భేద భావాలను సృష్టిస్తున్నారని తెలిపారు.
 
అయినా సరే భారతీయత అన్న ధర్మం ఆధారంగా ప్రజలందరూ కలిసికట్టుగానే వున్నారని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. వనవాసి అయినా, గ్రామ వాసి అయినా, నగర వాసి అయినా మనమందరమూ భారతవాసులమని ఆమె స్పష్టం చేస్తూ ఈ ఏకతా సూత్రమే అందర్నీ కలిపి వుంచుతోందని రాష్ట్రపతి చెప్పారు. 
 
చాలా కాలం పాటు భారత దేశాన్ని విదేశీయులు పాలించారని, ఈ సమయంలో ఆ సామ్రాజ్యవాద శక్తులు భారత ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టడంతో పాటు ఇక్కడి సామాజిక స్థితిగతులను కూడా ఛిన్నాభిన్నం చేశారని ఆమె తెలిపారు. మన సంస్కృతిని ఆంగ్లేయులు ఏహ్యభావంతో చూసేవారని, అలాగే మనలో కూడా మన సంస్కృతిపై ఏహ్య భావం వచ్చేలా కుట్రలు చేశారని ఆమె చెప్పారు. 
 
విదేశీయులు చాలా సంవత్సరాలు పరిపాలించడంతో మెదళ్లలో వలసవాద బుద్ధే ఆక్రమించిందని రాష్ట్రపతి ముర్ము విచారం వ్యక్తం చేశారు. భారత్ ని శ్రేష్ఠమైన దేశంగా నిర్మాణం చేయడానికి, భారతీయుల మానసిక ప్రవర్తనను మార్చి, వారిని ఏకత్వం, శ్రేష్ఠత్వం వైపు తీసుకెళ్లాల్సిన కర్తవ్యం అందరిపై వుందని ఆమె సూచించారు.
 
కొన్ని సంవత్సరాలుగా వలసవాద, బానిసత్వ మనస్తత్వం నుంచి బయటపడడానికి భారత్ లో కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె వివరించారు. ఇందులో భాగంగా భారతీయ న్యాయసంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్ చట్టాలను తీసుకొచ్చారని ఆమె చెప్పారు. అలాగే ఢిల్లీలో రాజ్ పథ్ పేరును తొలగించి, కర్తవ్య పథ్ గా నామకరణం చేశారని రాష్ట్రపతి గుర్తు చేశారు. 
 
ఈ అంశాలతో పాటు రాష్ట్రపతి భవన్ లో వుండే దర్బార్ హాలు పేరును కూడా గణతంత్ర మండపంగా మార్చుకున్నామని ఆమె తెలిపారు. మరోవైపు న్యాయ వ్యవస్థలో న్యాయదేవత విగ్రహానికి సంబంధించి, న్యాయదేవత కళ్లకు వుండే వస్త్రాన్ని తొలగించి, మార్పులు చేశారని వివరించారు. ఈ మార్పులన్నీ భారతీయ ప్రాచీన పరంపర మాధ్యమంగా వచ్చినవేనని, ఈ మార్పులన్నీ వలసవాద, బానిసత్వ మనస్తత్వం నుంచి బయటపడ్డామని కనిపించే ఉదాహరణలేనని రాష్ట్రపతి స్పష్టం చేశారు.
 
భారతీయ ఆధ్యాత్మికత, పరంపర, కళలు, సాహిత్యం, సంగీతం, చికిత్సా పద్ధతి, భాష ప్రపంచమంతా విస్తరించాయని, ప్రజలు ఆదర్శవంతంగా జీవించడానికి ఇవి ఉపయోగపడతాయని ఆమె పేర్కొన్నారు. ఈ పరంపరను మరింత పరిపుష్టం చేసుకోవాలని ముర్ము పిలుపునిచ్చారు. ప్రాచీన కాలం నుంచే భారతీయ ఆలోచాన పరంపర విదేశాలను బాగా ప్రభావితం చేసిందని చెబుతూ ఇప్పుడు మరింత విస్తరించిందని ఆమె తెలిపారు. 
 
ఈ ప్రభావాలు వారి ఆధ్యాత్మికతలో, సంస్కృతిలో ప్రస్ఫుటంగా ద్యోతకమవుతూనే వున్నాయని తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వం భారతీయ సంస్కృతి అని, అయితే అందులో ఏకత్వం ముఖ్యమైన సారమని రాష్ట్రపతి పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అన్న సారాంశంలో ఏకత్వమే మూలాధారమని, ఇది ఇంద్రధనస్సు లాంటిదని, అదే సుందరత్వాన్ని చేకూరుస్తుందని ఆమె అభివర్ణించారు.
 
ఈ లోక్ మంథన్ ను ప్రారంభించడం చాలా ఆనందంగా వుందని చెబుతూ 2018 లో రాంచీ వేదికగా జరిగిన లోక్ మంథన్ లో కూడా తాను పాల్గొన్నానని రాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు. భారత సంస్కృతిలోని ఏకత్వాన్ని మరింత సుదృఢం చేయడానికి ఈ మంథన్ ఉపయోగపడుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ప్రయత్నం అద్భుతమని కొనియాడారు. 
 
ఇలాంటి కార్యక్రమాల ద్వారా దేశ ప్రజల్లోని స్వాభిమానం, సాంస్కృతిక భావనలకు మరింత పుష్టి చేకూరుతుందని ఆమె చెప్పారు. భారత సంస్కృతి, సంప్రదాయాలను అర్థం చేసుకోవడంలో, మన పరంపరను ఎప్పటికప్పుడు మరింత పరిపుష్టం చేయడంలో అందరూ తమ వంతు పాత్రను పోషించాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.
 
ఈ లోక్ మంథన్ లో అహల్యాబాయి హోల్కర్, రుద్రమ దేవి లాంటి వీరనారీమణుల జీవిత గాథలను ఆధారంగా చేసుకొని నాటకాలు కూడా వున్నాయని తెలిసి చాలా ఆనందం వేసిందన ఆమె చెప్పారు.వీటి ద్వారా శౌర్య పరంపర, నారీశక్తిని బయటికి తీసినట్లవుతుందని ఆమె తెలిపారు. ఈ ప్రయత్నం ముఖ్యంగా యువతకు ఎంతో ప్రేరణనిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. భారతీయ కళలు, కళాకారులు జాతిని ఐక్యంగా వుంచడంలో ఉపయోగపడతాయని రాష్ట్రపతి ముర్ము తెలిపారు. ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.