పాక్‌లోని క్వెట్టా రైల్వే స్టేషన్‌లో పేలుడు.. 24 మంది మృతి

పాక్‌లోని క్వెట్టా రైల్వే స్టేషన్‌లో పేలుడు.. 24 మంది మృతి

పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్‌లోని క్వెట్టా రైల్వే స్టేషన్‌లో శనివారం జరిగిన పేలుడులో సుమారు 24 మంది మరణించారు. 40 మందికి పైగా గాయపడ్డారు. పేలుడు జరిగిన సమయంలో ప్లాట్‌ఫారమ్‌పై నుంచి పెషావర్‌కు వెళ్లేందుకు రైలు సిద్ధంగా ఉంది. ఈ సమయంలో పేలుడు సంభవించింది.

ఈ ఘటనలో ఇప్పటివరకు 24 మంది మృతి చెందినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. క్షతగార్తులందరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, రెస్క్యూ టీం ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే బాంబు స్క్వాడ్ బృందాలు వచ్చాయి. ప్రమాదంపై దర్యాపు జరుగుతోంది.

రైల్వే స్టేషన్​లోని బుకింగ్ కార్యాలయంలో పేలుడు సంభవించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. పేలుడు ధాటికి ప్లాట్​ఫామ్​ పైకప్పు దెబ్బతిన్నట్లు తెలిపారు. బాంబు పేలుడు శబ్ధం నగరంలోని వివిధ ప్రాంతాలకు వినిపించిందని చెప్పారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

 

క్వెట్టా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆపరేషన్స్ మహ్మద్ బలోచ్ మాట్లాడుతూ.. ‘ఈ సంఘటన సూసైట్ బాంబ్ ద్వారా జరిగిందనిపిస్తుంది. అయితే ఇది కచ్చితమని చెప్పలేం. పేలుడు స్వభావాన్ని నిర్ధారించడానికి దర్యాప్తు జరుగుతోంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ చాలా మంది ఉన్నారు.’ అని మహ్మద్ చెప్పారు.

 

సుమారు 100 మంది వ్యక్తులు ఉన్నట్టుగా తెలుస్తోందని మహ్మద్ చెప్పారు. బలూచిస్థాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టా నుండి గ్యారీసన్ సిటీ రావల్పిండికి వెళ్లేందుకు ప్రయాణికులు రైలు కోసం ఎదురు చూస్తున్న సమయంలో బాంబు పేలిందని తెలిపారు.

ఈ ఘటనపై బలూచిస్థాన్​ ముఖ్యమంత్రి సర్ఫరాజ్​ బుగ్తీ స్పందించారు. దాడిని తీవ్రంగా ఖండించారు. అమాయక పౌరులే లక్ష్యంగా దుండగులు భయానక దాడి చేశారని అన్నారు. ఈ పేలుడుపై తక్షణ విచారణకు ఆదేశించారు. పౌరులు, కార్మికులు, మహిళలు, పిల్లలు లక్ష్యంగా ఉగ్రవాదులు దాడి చేస్తున్నారని, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.

 

ఇటీవలి కాలంలో పాక్‌లో బాంబు పేలుడు ఘటనలు ఎక్కువైపోయాయి. కొన్ని రోజుల కిందట ఉత్తర వజీరిస్థాన్‌లో పేలుడు ఘటనలో నలుగురు భద్రతా సిబ్బంది చనిపోయారు. కొందరికి గాయాలు అయ్యాయి. అంతేకాదు.. ఓ పాఠశాల దగ్గరలోనూ బాంబు పేలుడుతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటనలకు కొన్ని రోజుల కిందట బలూచిస్థాన్‌లోని ఒక పాఠశాల సమీపంలో బాంబు పేలగా.. ఐదుగురు పాఠశాల విద్యార్థులతో సహా ఏడుగురు చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. ఇలా అనేగ బాంబు పేలుడు ఘటనలు పాకిస్థాన్‌లో జరుగుతున్నాయి.