మయోనైజ్‌పై తెలంగాణాలో నిషేధం

మయోనైజ్‌పై తెలంగాణాలో నిషేధం

ప్రజల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతున్న మయోనైజ్‌ను నిషేధించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉడకబెట్టని కోడిగుడ్లతో తయారు చేస్తున్న మయోనైజ్‌ను ఏడాది పాటు నిషేధిస్తున్న ట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీసులో ఫుడ్ సేఫ్టీపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లతో నియమించిన టాస్క్‌ఫోర్స్ కమిటీల పనితీరుపై ఆరా తీశారు. 235 హోటళ్లు, హాస్టళ్లు, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్, గోడౌన్స్‌లో తనిఖీలు నిర్వహించామని, 170 సంస్థలకు నోటీసులు ఇచ్చామని జిహెచ్‌ఎంసి టాస్క్‌ఫోర్స్ అధికారులు మంత్రి దామోదర్ రాజనర్సింహకి తెలియజేశారు.అన్ని జిల్లాల్లోనూ నిరంతరం తనిఖీలు నిర్వహించాలని మంత్రి ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆదేశించారు.

ఇందుకోసం రెండు టాస్క్‌ఫోర్స్ కమిటీలను నియమించారు. హైదరాబాద్ లోని నందినగర్‌లో మోమో స్ తిని ఒక మహిళ మరణించగా పలువురు అస్వస్థతకు గురైన ఘటనపై మంత్రి ఆరా తీశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే విధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ దిశానిర్దేశం చేశారు.

వివిధ రకాల ఆహార పదార్థాలతో కలిపి తినే మయోనైజ్‌ను కల్తీ ఎగ్స్‌తో, ఉడకబెట్టని ఎగ్స్‌తో తయారు చేస్తున్నారని, దానివల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని అదికారులు మంత్రి దామోదర్ రాజనర్సింహకు వివరించారు. మయోనైజ్ క్వాలిటీ తిన్న తర్వాత కలిగిన దుష్పరిణామాలపై పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు.
కేరళలో ఈ తరహా మయోనైజ్ తయారీని అక్కడి ప్రభుత్వం నిషేధించిందని, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మన రాష్ట్రంలో నిషేధం విధించాలని అధికారులు మంత్రికి నివేదించారు.

అధికారుల నివేదిక ప్రకారంగా పలువురు డాక్టర్లు, ఫుడ్ సేఫ్టీ ఉన్నతాధికారులతో చర్చించిన మంత్రి, మయోనైజ్‌పై రాష్ట్రం లో నిషేధం విధించేందుకు ఆదేశాలు జారీ చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ శాఖ కమిషనర్ ఆర్ వి కర్ణన్ ను ఆదేశించారు.

రాష్ట్రంలో గత పదేండ్లలో హోటళ్లు, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్, హాస్టళ్ల సంఖ్య భారీగా పెరిగిందని, ఇందుకు అనుగుణంగా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ బలోపేతం కాలేదని, కొత్త పోస్టులు మంజూరు కాలేదని అధికారులు మంత్రికి వివరించారు. ఫుడ్ సేఫ్టీలో ముందున్న రాష్ట్రాలు, దేశాల్లో అవలంభిస్తున్న పద్ధతులపై అధ్యయనం చేసి, నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ సంఖ్యను పెంచేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు.