దేశంలో 70ఏళ్లకు పైబడి వృద్ధులకు రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా పథకం ‘ఆయుష్మాన్ భారత్’ను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు. డిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద-ఏఐఐఏలో జరిగిన కార్యక్రమంలో అర్హులైన వారికి ‘అయుష్మాన్ భారత్ వయ వందన’ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోదీ, ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశం పురోగతి వేగం పుంజుకుంటుందని తెలిపారు. అందుకోసం ఐదు మూలస్తంభాలతో ఆరోగ్యం విధానం ఏర్పాటు చేసిందని తెలిపారు. నివారణ, ఆరోగ్య సంరక్షణ, సకాలంలో రోగనిర్ధరణ, సరసమై ధరల్లో మందులు-చికిత్స, పట్టణాలు- గ్రామాల్లో సరైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల ఏర్పాటు- హెల్త్కేర్ రంగంలో సాంకేతిక విస్తరణపై దృష్టి సారించామని మోదీ చెప్పారు.
“పేద ప్రజల కోసం రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులు భరించేలా మా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా సూమారు 4 కోట్ల మంది పేదలు లబ్ధి పొందారు. 70ఏళ్లకు పైబడిన వారిని ఆయుష్మాన్ భారత్ కింద కవర్ చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఈరోజు నేరవేర్చాం” అని ప్రధాని ప్రకటించారు.
“ఒకప్పుడు వైద్యం కోసం ఇళ్లు, భూములు, నగలు అమ్మేసేవారు. ఇక తీవ్రమైన వ్యాధులు వస్తే- దాని చికిత్సకు అయ్యే ఖర్చు విని వణికిపోయేవారు. డబ్బు లేకపోవడం వల్ల వైద్యం చేయించుకోలేని నిస్సహాయత ఉండేది. ఆ నిస్సహాయతలో నా పేద సోదరీమణులను చూడలేకపోయాను. అందుకే అయుష్మాన్ భారత్ పథకం కింద రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలని నిర్ణయించాము” అని ప్రధాని మోదీ తెలిపారు.
‘ఈసారి దీపావళి ప్రత్యేకం’
ధన్వంతర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈసారి జరిగే దీపావళి ప్రత్యేకమన్న మోదీ, ప్రజలకు ముందస్తు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. 500ఏళ్ల తర్వాత అయోధ్య రామాలయంలో దీపాలు వెలిగిస్తారన్నారు. ఈసారి 14సంవత్సరాల తర్వాత కాదు, 500 ఏళ్ల తర్వాత రాముడు అయోధ్యకు తిరిగివచ్చారని పేర్కొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యము అన్న మోదీ, ఆయుర్వేద దినోత్సవం పేరుతో ప్రాచీన సంప్రదాయాలు వ్యాప్తి చెందుతున్నాయని వివరించారు.
“ఆరోగ్యం, ఐశ్వర్యాన్నిచ్చే ఈ పండుగ కేవలం యాదృచ్ఛికమే కాదు, భారతీయ సంస్కృతికి ప్రతీక. ఆరోగ్యమే మహాభాగ్యము అని మన సాధువులు చెప్పారు. ఈ ప్రాచీన ఆలోచనలు ఆయుర్వేద దినోత్సవం పేరుతో విస్తరిస్తున్నాయి. 150కి పైగా దేశాల్లో ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకోవడం- ప్రపంచం ఆయుర్వేదం వైపు అట్రాక్ట్ అవుతుంది అనడానికి నిదర్శనం” అని మోదీ తెలిపారు.
దేశవ్యాప్తంగా ఆరు కోట్లమంది వృద్ధులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని అంచనా. ఆయుష్మాన్ భారత్ కార్డు ఉన్న సీనియర్ సిటిజన్లకు కుటుంబ ప్రాతిపదికన ఏటా రూ.5 లక్షల వరకు లబ్ధి పొందుతారు. అన్ని సామాజిక, ఆర్థిక వర్గాల వారికి వైద్యబీమా లభిస్తుంది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త కార్డులు అందిస్తారు. కాగా, ఇప్పటికే ఈ బీమా పథకం పరిధిలో ఉన్న వృద్ధులకు ఇప్పుడు రూ.5 లక్షల అదనపు కవరేజీ లభిస్తుంది.
కుటుంబంలో 70 ఏళ్లపైబడిన వారు ఇద్దరు ఉంటే వారికి సగం, సగం ప్రయోజనం ఉంటుంది. సీజీహెచ్ఎస్, ఎక్స్సర్వీస్మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్స్కీం, ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ పథకాల కింద ఉన్న వృద్ధులు వాటిని గానీ, ఏబీపీఎంజేఏవై పథకం రెండింట్లో ఒకటి ఎంచుకోవచ్చు. ప్రైవేటు వైద్యఆరోగ్య బీమా, కార్మిక రాజ్య బీమా కింద ప్రయోజనం పొందుతున్నవారు కూడా ఈ రూ.5 లక్షల ప్రయోజనం పొందవచ్చు.
More Stories
అనేక ప్రాణాంతక దాడుల రూపశిల్పి హిడ్మా కోసం వేట!
శతాబ్ది ఉత్సవాల్లో ప్రతి గ్రామంకు, ప్రతి ఇంటికి ఆర్ఎస్ఎస్
భద్రతా మండలిలో భారత్, బ్రెజిల్ లకు చోటు కల్పించాలి