
ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞాన వినియోగం విషయంలో నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. అందుకోసం అంతర్జాతీయ సంస్థలు కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. నాలుగేళ్లకు ఒకసారి జరిగే వరల్డ్ టెలీకమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ-2024ను డిల్లీలోని భారత్ మండపంలో ప్రధాని మోదీ మంగళవారం ప్రారంభించారు.
అలాగే దేశీయ ఆవిష్కరణలు ప్రదర్శించేందుకు నిర్వహించే ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ఈవెంట్ 8వ ఎడిషన్ను కూడా ఈ కార్యక్రమంలోనే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విమానయాన రంగానికి గ్లోబల్ కమ్యూనిటీ సమగ్రమైన ఫ్రేమ్వర్క్ను రూపొందించినట్లే, డిజిటల్ ప్రపంచానికి కూడా నియమాలు, నిబంధనలు అవసరమని స్పష్టం చేశారు.
‘భారతదేశంలో 120 కోట్ల మొబైల్, 95 కోట్ల ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. ప్రపంచంలోనే 40 శాతానికి పైగా డిజిటల్ లావాదేవీలు భారతదేశంలో జరుగుతున్నాయి. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను విజయవంతంగా నిర్మించడంలో భారతదేశం తన అనుభవాన్ని ఇతర దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉంది’ అని ప్రధాని తెలిపారు. డిజిటల్ కనెక్టివిటీ చాలా కీలకమైన టూల్గా మారినట్లు తెలిపారు.
“కేవలం పదేళ్లలోనే ఏర్పాటు చేసిన ఆప్టికల్ ఫైబర్- భూమి, చంద్రుని మధ్య దూరం కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ. రెండు సంవత్సరాల క్రితం మొబైల్ కాంగ్రెస్లోనే 5జీ సేవలను ప్రారంభించాం. దేశంలోని ప్రతి జిల్లాను 5జీ సేవలతో అనుసంధానం చేశాం. ఇప్పుడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద 5జీ మార్కెట్గా భారతదేశం అవతరించింది. ప్రస్తుతం 6జీ టెక్నాలజీ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాం” అని మోదీ తెలిపారు.
More Stories
జీఎస్టీ సంస్కరణలు పొదుపు పండుగ లాంటిది
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం