
ఈనెల 15,16 తేదీల్లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం కోసం పాకిస్థాన్ వెళ్తున్న భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ తన పర్యటనలో దాయాది దేశంతో ఎలాంటి ద్వైపాక్షిక చర్చలు ఉండవని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఒక కార్యక్రమానికి వచ్చిన జైశంకర్ మీడియాతో మాట్లాడుతూ, బహుళపక్ష కార్యక్రమంలో పాల్గొనేందుకు తాను వెళ్తున్నానని, భారత్-పాక్ సంబంధాల గురించి మాట్లాడేందుకు కాదని చెప్పారు.
గత తొమ్మిదేళ్లలో భారత విదేశాంగ మంత్రి పాకిస్తాన్ వెళ్తుండటం ఇదే మొదటిసారి. పాకిస్తాన్ను సందర్శించిన చివరి భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్. ఆఫ్ఘనిస్తాన్పై ఒక మహాసభ కోసం ఆమె 2015 డిసెంబర్లో ఇస్లామాబాద్కు వెళ్లారు. ఎస్సీఓలో సభ్యుడిగానే తాను అక్కడకు వెళ్తున్నానని పేర్కొంటూ తనొక మర్యాద కలిగిన పౌరుడనని, అందుకు అనుగుణంగానే వ్యవహరిస్తారని తెలిపారు.
”నేను బహుళ పాక్షిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్నా. భారత్-పాకిస్థాన్ సంబంధాలు గురించి మాట్లాడేందుకు కాదు. ఎస్సిఒలో సభ్యుడిగా ఆ దేశంలో పర్యటిస్తున్నా. నేనొక మర్యాదగల పౌరుడిని.. దానికి అనుగుణంగానే వ్యవహరిస్తాను” అని చెప్పారు. ఈ ఏడాది పాకిస్థాన్లో ఎస్సిఒ సదస్సు జరుగుతోందని, భారతదేశం మాదదిరిగానే పాకిస్థాన్ కూడా ఆ కూటమిలో సభ్యదేశంగా ఉందని తెలిపారు. గతేడాది మేలో గోవాలో జరిగిన ఎస్సిఒ సదస్సులో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో హాజరయ్యారని ఆయన గుర్తు చేశారు. ఆరేళ్ల తర్వాత పాకిస్థాన్ నేత ఒకరు భారత్ను సందర్శించడం అదే మొదటిసారి.
కాగా, సౌత్ ఏసియన్ అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కో-ఆపరేషన్ (సార్క్) కార్యక్రమాలు నిలిచిపోవడంపై పాక్ను జైశంకర్ పరోక్షంగా తప్పుపట్టారు. ప్రస్తుతానికైతే సార్క్ కార్యక్రమాలు ముందుకు వెళ్లడం లేదని, సార్క్లోని ఒక సభ్యదేశం ఆ గ్రూపునకే చెందిన మరో దేశంపై ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందని పాక్ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.
ఆ కారణం వల్లే ఇటీవల కాలంలో సార్క్ సమావేశాలు జరగడంలేదని స్పష్టం చేశారు. అయితే ప్రాంతీయ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయినట్లు కాదని పేర్కొన్నారు. నిజానికి గత ఐదారేళ్లుగా భారత ఉపఖండంలో ప్రాంతీయ సమైక్యత పెరిగిందని చెప్పారు. కాగా, ఎస్సీఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆప్ గవర్నమెంట్ సమావేశానికి ఈసారి పాక్ ఆతిథ్యం ఇస్తుంది. ఇది ఇలా ఉండగా, మధ్య ప్రాచ్యంలో ఘర్షణ పరిస్థితి ‘అత్యంత ఆందోళనకరం’ అని విదేశాంగ శాఖ మంత్రి చెప్పారు. లెబనాన్పై తన దాడులను ఉద్ధృతంచేస్తున్న ఇజ్రాయెల్కు ఇరాన్తో సంఘర్షణ తప్పకపోవచ్చు.
More Stories
‘మోహన్లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్గా అర్షదీప్