జమ్మూ కాశ్మీర్ లో సంకీర్ణమే …. కాంగ్రెస్- ఎన్సీ వైపు మొగ్గు!

జమ్మూ కాశ్మీర్ లో సంకీర్ణమే …. కాంగ్రెస్- ఎన్సీ వైపు మొగ్గు!
పదేళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్న జమ్మూ కాశ్మీర్ లో ఏ పార్టీ కూడా సొంతంగా మెజారిటీ మార్క్ అయినా 46 సీట్లు గెల్చుకోలేదని, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు తధ్యమని స్పష్టం చేస్తూ కాంగ్రెస్- నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి వైపు స్వల్పంగా మొగ్గు ఉన్నట్లు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న రాజకీయ రీసెర్చ్ సంస్థ  పీపుల్స్ పల్స్  నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి.
 
జమ్మూకాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర హొదా తొలగింపు తర్వాత తొలిసారిగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలపై దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మూడు విడతలలో ముగిసిన ఈ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న వెలువడనున్నాయి. 
 
ఈ సర్వే అంచనాల ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ -కాంగ్రెస్ కూటమి 46-50 స్థానాలు, బీజేపీ 23-27 స్థానాలు, పీడీపీ 7-11 స్థానాలు, ఏఐపీ 0-1, ఇతరులు 4-5 స్థానాలు గెలిచే అవకాశాలున్నట్లు తేలింది. ఎన్సీ-కాంగ్రెస్ కూటమిలో ఎంసీ  33-35, కాంగ్రెస్ 13-15 స్థానాలు గెలవవచ్చు. ఎన్సీ 29 శాతం, కాంగ్రెస్ 14 శాతం, బీజేపీ 24 శాతం, పీడీపీ 16 శాతం, ఏఐపీ 5 శాతం, ఇతరులు 12 శాతం ఓట్లు పొందవచ్చని సర్వేలో తేలింది. 
 
కలిసి పోటీ చేసిన ఎన్సీ-కాంగ్రెస్ కూటమికి 43 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని  పీపుల్స్ పల్స్  డైరెక్టర్ ఆర్ దిలీప్ రెడ్డి తెలిపారు జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఎవరికి ప్రాధాన్యతిస్తారని సర్వేలో కోరగా ఎన్సీ నేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు సుమారు 28 శాతం మంది మద్దతిచ్చారు. ఒమర్ అబ్దుల్లా తండ్రి, రాష్ట్ర సీనియర్ నేత, మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాకు సుమారు 2 శాతం మందే మద్దతిచ్చారు. పీడీపీ అధినేత, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీకి, ఏఐపీ అధినేత లోకసభ సభ్యులు ఇంజినీర్ రషీద్ కు చెరో 8 శాతం మద్దతు సర్వేలో కనిపించింది.
 
కాంగ్రెస్- ఎన్సీ మధ్య పొత్తు ఈ ఎన్నికల్లో కీలకంగా పనిచేసింది. దాదాపు 46 శాతం మంది ఈ కూటమి తమ ప్రయోజనాలకు ఉత్తమంగా ఉపయోగపడుతుందని విశ్వసించారు. హిందువుల ఏకీకరణతో ప్రయోజనం పొందాలని చూసిన బీజేపీకి జమ్మూ ప్రాంతంలో లబ్ధి చేకూరింది. జమ్మూలో కాంగ్రెస్ పేవలమైన ప్రచారం కూడా బీజేపీకి కలిసివచ్చింది. అధిక ప్రచారంతో నిత్యం వార్తల్లో ఉన్న అవామీ ఇత్తేహాద్ పార్టీ (ఏఐపీ) ఒక్క సీటుకే పరిమితం కావచ్చు. 
 
పీపుల్స్ కాన్ఫరెన్స్, అప్నీ పార్టీ వంటి చిన్న పార్టీలను కలుపుకొని మొత్తం మీద ఇతరులకు దాదాపు 4 నుండి 5 సీట్లు రావచ్చని సర్వేలో తేలింది.  అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉందని సర్వేలో వెల్లడైంది. ఉపాధి కల్పన, ఆర్థికాభివృద్ధి పరంగా ఈ ప్రాంతం ఎదుర్కొంటున్న సవాళ్లను ఓటర్లు ఎత్తిచూపారు. నిత్యవసర వస్తువుల ధరలతో పాటు విద్యుత్ చార్జీల పెరుగుదల, ఆశించిన అభివృద్ధి లేకపోవడం ఎన్నికల్లో కీలకాంశాలుగా మారాయి.
నరేంద్ర మోదీ ప్రభుత్వం 2019 ఆగస్టులో జమ్మూకాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేయడంతో పాటు రాష్ట్ర హోదాను తొలగించి లడఖ్ ను వేరు చేస్తూ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడంపై అత్యధిక ప్రజలు ఆగ్రహంగా ఉన్నట్లు సర్వేలో స్పష్టమైంది. రాష్ట్ర హోదాను తిరిగి కల్పించాలని 67 శాతం మంది గట్టిగా కోరారు. పీపుల్స్ పల్స్, డిజిటల్ వార్త సంస్థ సౌత్ ఫస్ట్ సంస్థలు సంయుక్తంగా జమ్మూ కశ్మీర్ ప్రజల మనోభావాలను తెలుసుకునేందుకు పీపీఎస్ విధానంలో 25 నియోజకవర్గాలను ఎంపిక చేసుకొని సర్వే సర్వేనిర్వహించాయి.