భారత్‌- చైనాల మధ్య తాము శ్రీలంక నలిగిపోదల్చుకోలేదు

భారత్‌- చైనాల మధ్య తాము శ్రీలంక నలిగిపోదల్చుకోలేదు

భారత్‌-చైనాల మధ్య తాము నలిగిపోదల్చుకోలేదని శ్రీలంక నూతన అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే వెల్లడించారు. అసలు ఏ రెండు దేశాల మధ్య తాము ఒత్తిడికి గురికావాలని కోరుకోవడం లేదని తేల్చిచెప్పారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన విదేశాంగ విధానంపై తన వైఖరిని స్పష్టం చేశారు. భౌగోళిక రాజకీయ శత్రుత్వాల మధ్య చిక్కుకోనే పరిస్థితులకు కొలంబో వీలైనంత దూరంగా ఉంటుందని తేల్చిచెప్పారు.

తాము ఓ వర్గం పక్షం వహించమని చెబుతూ భారత్‌- చైనాలతో సంబంధాలను ఎన్‌పీపీ (నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌) ప్రభుత్వం బ్యాలెన్స్ చేసుకొంటూ వెళ్లాలని నిర్ణయించిందని తెలిపారు.

” భౌగోళిక రాజకీయ యుద్ధంలో మేము పోటీదారులం కాదు. భవిష్యత్తులో వాటిల్లో భాగస్వామి కాబోము. వీటిల్లో శాండ్‌విచ్‌ వలే నలిగిపోవాలనుకోవడం లేదు. ముఖ్యంగా భారత్‌- చైనా మధ్య ఇబ్బంది పడాలనుకోవడంలేదు. ఇరు దేశాలు మాకు విలువైన మిత్రులే. ఎన్‌పీపీ ప్రభుత్వ హయాంలో మా స్నేహం మరింత బలపడుతుందని భావిస్తున్నాను. అదే సమయంలో ఐరోపా, పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాలతో సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నాం” అని తన విదేశాంగ విధానంపై దిసనాయకే కీలక విషయాలు వెల్లడించారు.

ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ శ్రీలంక సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి తటస్థ వైఖరి చాలా కీలకమని దిసనాయకే అభిప్రాయపడ్డారు. ప్రపంచ శక్తుల అధిపత్య పోరుకు శ్రీలంక దూరమని స్పష్టం చేశారు. అదే సమయంలో ఉభయ పక్షాలకు ప్రయోజనకరంగా ఉండేలా దౌత్య, భాగస్వామ్యాలను కుదుర్చుకోవడంపై తాము దృష్టిపెడతామని వెల్లడించారు.

ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన దిసనాయకే సోమవారం బాధ్యతలు చేపట్టారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జయంత జయసూరియా దేశ 9వ అధ్యక్షుడిగా ప్రమాణం చేయించారు. అధ్యక్ష సచివాలయం ఇందుకు వేదికైంది. అనంతరం దిసనాయకే జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రజాతీర్పును గౌరవిస్తూ అధికార మార్పిడి శాంతియుతంగా సాగేందుకు సహకరించిన తాజా మాజీ అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘేకు కృతజ్ఞతలు తెలిపారు.