
నివురుగప్పిన నిప్పులా ఉన్న పశ్చిమాసియాలో అనూహ్య ఘటన జరిగింది. లెబనాన్తో పాటు సిరియాలో పలుచోట్ల హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్ సభ్యులకు చెందిన పేజర్ పరికరాలు ఒక్కసారిగా పేలిపోయాయి. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 3,000 మంది గాయపడినట్లు లెబనాన్ ఆరోగ్యశాఖ మంత్రి ఫిరాస్ అబైద్ వెల్లడించారు. వారిలో 200 మందికి తీవ్ర గాయాలైనట్టు చెప్పారు.
ఇజ్రాయిల్ నిఘా సంస్థ మసూద్ “నిగూఢ సందేశం” అందుకున్న తర్వాత వేలాది పేజర్లు పేలినట్లు బహుళ మీడియా నివేదించింది. తొలుత వేడిగా మారిన పేజర్లు ఆ తర్వాత పేలిపోయినట్టు తెలుస్తోంది. చేతులకు, ప్యాంటు జేబుల వద్ద గాయాలతో లెబనాన్ రాజధాని బీరూట్ శివార్లలో అనేక మంది పడిపోయారు. క్షతగాత్రులకు అత్యవసర వైద్యం అందించాలని లెబనాన్ ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. వైర్లెస్ పరికరాలను వినియోగించొద్దని సిబ్బందికి సూచించింది.
పేజర్ దాడుల్లో ఇరాన్ రాయబారి సైతం గాయపడినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ నిఘా సంస్థ సెల్ఫోన్లను ట్రాక్ చేసే ప్రమాదముందని వాటిని వాడొద్దని హెజ్బొల్లా సభ్యులకు ఆ సంస్థ అధినేత హసన్ నస్రల్లా ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. దీంతో హెజ్బొల్లా పేజర్లను కొనుగోలు చేసి వినియోగిస్తోంది.
ఈ క్రమంలోనే అవి అనూహ్యంగా పేలిపోవడం వల్ల ఇజ్రాయెల్- హెజ్బొల్లా మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. చేతిలో పట్టుకునే వీలున్న పేజర్లను అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పేల్చేశారని లెబనాన్ మీడియా ఆరోపించింది. ఈ పేలుళ్లలో మృతుల సంఖ్యపై ఎటువంటి సమాచారం అందుబాటులోకి రాలేదు.
హెజ్బుల్లా సభ్యుల చేతుల్లో ఉన్న పేజర్లు పేలిపోయాయని, ఇది ఇజ్రాయెలీ జరిపిన దాడిగా అనుమానిస్తున్నామని లెబనాన్కు చెందిన ఒక అధికారి తెలిపారు. చేతులు, ప్యాంట్ పాకెట్లలో ఉంచుకున్న పేజర్లు పేలిపోవడంతో రక్తసిక్త గాయాలతో అనేక మంది రోడ్లపైన పడిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నట్లు అక్కడి మీడియా తెలిపింది.
అత్యవసర రోగులను చేర్చుకోవడానికి ఆసుపత్రులన్నీ సిద్ధంగా ఉండాలని లెబనాన్ ఆరోగ్య శాఖ పిలుపునిచ్చింది. లెబనాన్లో తమ సభ్యులతోసహా పౌరుల వద్ద ఉన్న పేజర్లు పేలిపోయి కనీసం 150 మంది వరకు లెబనాన్లోని వివిధ ప్రాంతాలలో గాయపడ్డారని హెజ్బుల్లా అధికారి ఒకరు తెలిపారు. ఈ దాడి వెనుక శత్రువు(ఇజ్రాయెల్) ఉన్నట్లు ఆ అధికారి చెప్పారు.
హెజ్బుల్లా సభ్యుల వద్ద ఉన్న కొత్త పేజర్లలో లిథియం బ్యాటరీలు ఉన్నాయని, అవే పేలి ఉంటాయని ఆయన చెప్పారు. ఓవర్హీట్ అయినపుడు లిథియం బ్యాటరీల నుంచి పొగ రావడం లేదా కరిగిపోవడం లేదా మంటలు రావడం జరుగుతుంది. రిచార్జబుల్ లిథియం బ్యాటరీలను సెల్ఫోన్ల నుంచి లాప్టాప్లు, ఎలెక్ట్రిక్ కార్ల వరకు వివిధ వినియోగ వస్తువులలో ఉపయోగిస్తారు.
కాగా..లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత తీవ్రరూపం దాల్చిన సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్, గాజాలోని హమాస్ మధ్య యుద్దం జరుగుతున్న నేపథ్యంలో హమాస్కు మద్దతుగా నిలిచిన లెబనాన్కు చెందిన తీవ్రవాద గ్రూపు హెజ్బుల్లాకు, ఇజ్రాయెలీ సేనలకు మధ్య గత గడచిన 11 నెలలుగా భీకర పోరాటం సాగుతోంది.
ఈ పోరులో లెబనాన్లో వందలాది మంది మరణించగా ఆఇజ్రాయెల్లో డబన్ల కొద్దీ మరణించారు. ఇరుదేశాల సరిహద్దుల్లో వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ఇజ్రాయిల్తో ఉద్రిక్తతలు పెచ్చరిల్లిన వేళ హిజ్బుల్లా పాత కాలపు పద్దతులను ఉపయోగిస్తోంది. శత్రువు ఆధునిక నిఘా పద్దతులకు దొరక్కుండా వుండేలా కోడ్ సందేశాలు, ల్యాండ్లైన్ ఫోన్లు వాడుతోంది. అందులో భాగమే ఈ పేజర్లు కూడా. ఇటీవలనే టైవాన్ లో తయారైన 5,000 పేజర్లను తెప్పించారు.
More Stories
పాకిస్థాన్ సహా 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్
ఐఎస్ఐఎస్ చీఫ్ ను హతమార్చిన అమెరికా దళాలు
తమిళనాడులో రూ.1000 కోట్ల లిక్కర్ స్కామ్!