
బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల గొడవలు చినికి చినికి గాలివానగా మారి , తీవ్రమైన హింసకు దారి తీయడంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి మన దేశానికి పారిపోయి వచ్చే పరిస్థితులు ఎదురయ్యాయి. హసీనా అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత హిందువులపై దాడులు పెరిగాయి.
ఆలయాలను ధ్వంసం చేశారు, హిందూ వ్యాపారులను హింస పెట్టారు. ఇప్పుడిప్పుడే పరిస్థితి చక్కబడుతోంది. త్వరలో శరన్నవరాత్రులు ప్రారంభం కానుండడంతో బంగ్లా ప్రభుత్వం అక్కడి హిందూ సమాజం ముందు కీలకమైన ప్రతిపాదన ఉంచింది. అజాన్, నమాజ్ సమయాల్లో దుర్గాపూజకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిలిపేయాలని, ముఖ్యంగా సంగీత వాయిద్యాలు, పాటలు పాడడం లాంటివి చేయకూడదన్నది ఆ ప్రతిపాదన సారాంశం.
బంగ్లాదేశ్ హోం వ్యవహరాల సలహాదారు లెఫ్టినెంట్ జనరల్(రిటైర్డ్) ఎండీ జహంగీర్ అలం చౌదరి స్వయంగా ఈ విజ్ఞప్తి చేశారు. నమాజ్ సమయంలో దుర్గా పూజ నిలిపేయాలని, అజాన్ కి ఐదు నిముషాల ముందే విరామం పాటించాలని కోరారు. సంగీత వాయిద్యాలు, సౌండ్ సిస్టమ్స్ ఆఫ్ చేయాలన్న విజ్ఞప్తులను హిందూ సంఘాలు అంగీకరించాయని చెప్పారు జహంగీర్ అలం.
దుర్గా పూజ అంటే బంగ్లాదేశ్ లో హిందువులకు అతి పెద్ద పండుగ. ఈ మధ్య జరిగిన మత ఘర్షణలను పరిగణలోకి తీసుకుని బంగ్లా ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన వచ్చింది. ఈ ఏడాది బంగ్లా వ్యాప్తంగా 32,666 పూజా మండపాలను ఏర్పాటు చేయనున్నట్లు జహంగీర్ అలం చౌదరి తెలిపారు.
వీటిలో 157 మండపాలు ఢాకా సౌత్ సిటీలో, 88 నార్త్ సిటీ కార్పొరేషన్లలో ఉంటాయని ఢాకా ట్రిబ్యూన్ వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏర్పాటు చేస్తున్న దుర్గా మండపాల కొంచెం తక్కువే. 2023 లో మండపాల సంఖ్య 33,431 కాగా, 2024 లో 32,666 దుర్గా మండపాలు ఏర్పాటు చేయాలని చూస్తున్నారు.
ఈ ఆంక్షలను వివరించడంతో పాటు, చౌదరి హిందూ సమాజానికి తగు భద్రతా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విగ్రహాల నిర్మాణం మొదలుకొని అన్ని పూజా వేదికల వద్ద ఎలాంటి ఆటంకాలు లేదా నేర కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం 24 గంటలూ భద్రత కల్పించేందుకు కృషి చేస్తోందని ఆయన భరోసా ఇచ్చారు. “దుర్గా పూజ వేడుకలు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగేలా చూసుకోవడానికి మేము కట్టుబడి ఉన్నాము” అని చౌదరి చెప్పారు.
More Stories
ప్రత్యేక దేశంగా పాలస్తీనా .. భారత్ సంపూర్ణ మద్దతు
నేపాల్ తొలి మహిళా ప్రధానిగా సుశీలా కర్కి
భారత్ లక్ష్యంగా కొత్త చట్టానికి ట్రంప్ ప్రతిపాదన