ఏడాదిలోగా గన్నవరంలో ఎయిర్‌పోర్ట్ కొత్త టెర్మినల్‌

ఏడాదిలోగా గన్నవరంలో ఎయిర్‌పోర్ట్ కొత్త టెర్మినల్‌
ఏడాదిలోగా గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్‌పోర్ట్ కొత్త టెర్మినల్‌ ప్రారంభిస్తామని  కేంద్ర పౌరవిమానయాన శాఖ  మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. గన్నవరం ఎయిర్​పోర్ట్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతామని  చెబుతూ  దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా కనెక్టివిటీ పెంచుతున్నామని ఆయన తెలిపారు.
 
విజయవాడలో గన్నవరం విమానాశ్రయంలో ప్రోచ్ రహదారిని, విజయవాడ- ఢిల్లీ ఇండిగో సర్వీసును ప్రారంభిస్తూ ఆగస్టులో ఈ విమానశ్రయం నుంచి ప్రయాణికుల సంఖ్య 85,000 నుండి లక్షకు పెరిగిందని చెప్పారు. విజయవాడ నుంచి ఇంటర్నేషనల్ కనెక్షన్ పెంచడానికి ఆలోచిస్తున్నామని చెప్పారు.  ఇందులో భాగంగానే 3 నెలల్లోనే 4 కొత్త సర్వీసులు ఏర్పాటు చేసుకున్నామని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. 
 
అక్టోబర్ 26న విజయవాడ నుంచి పుణెకు కొత్త సర్వీసు, అక్టోబర్‌ 27న విశాఖ- దిల్లీకి సర్వీసును ప్రారంభించనున్నట్లు చెప్పారు. షార్జాకు ప్రస్తుతం సర్వీసులు నడుస్తున్నాయని పేర్కొన్నారు. వీటిని దుబాయ్‌, సింగపూర్‌కు విస్తరించనున్నట్లు చెప్పారు. 
 
“రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, పర్యటకాభివృద్ధికి మా శాఖ తరుపున కృషి చేస్తున్నాము. విజయవాడ విమానాశ్రయం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాం. దేశం మొత్తం ఆంధ్రా వైపు చూసేలా కనెక్టివిటీ పెంచుతున్నాం. కొత్తగా ముంబయికి 2, బెంగుళూరుకు 1, ఢిల్లీకి 1 సర్వీసు చొప్పున ప్రారంభించాం. భవిష్యత్​లో సింగపూర్, దుబాయ్‌లకు కూడా సర్వీసులు విస్తరించనున్నాం”  అని వివరించారు.
 
ప్రధాని మోదీ హయంలో పదేళ్లలో 57 విమానాశ్రయాలు నిర్మించారని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. భవిష్యత్​లో నూతనంగా 200 కొత్త ఎయిర్‌పోర్ట్​లను నిర్మించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు. మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు, మైసూరు ఎంపీ యధువీర్‌ కూడా పాల్గొన్నారు.