వియత్నాంలో యాగి తుపాను బీభత్సం సృష్టిస్తున్నది. భారీ వర్షం, బలమైన ఈదురుగాలులు, కొండచరియలు విరిగిపడటం, పోటెత్తిన వరదలు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ టైఫూన్ ధాటికి ఆ దేశంలో ఇప్పటికే 179 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 58 మంది గల్లంతయ్యారని వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది.
ఇక మృతుల్లో 29 మంది కావో బ్యాంగ్ ప్రావిన్స్కు చెందినవారు, 45 మంది లావో కై ప్రావిన్స్కు చెందినవారు, 37 మంది యెన్ బాయి ప్రావిన్స్కు చెందినవారు ఉన్నట్లు తెలిపింది. క్యూయెట్ థాంగ్ కమ్యూన్ గుండా ప్రవహించే డైక్ నదికి పోటెత్తిన భారీ వరద నీటి కారణంగా పొంగిపొర్లిందని తుయెన్ క్వాంగ్ ప్రావిన్స్ స్థానిక అధికారులు ధృవీకరించారు.
రాజధాని హనోయిలోని రెడ్ రివర్పై వరద స్థాయులు మూడో స్థాయి హెచ్చరికలను దాటాయి. బుధవారం మధ్యాహ్నానికి అత్యధిక స్థాయికి చేరుకుంటాయని నేషనల్ సెంటర్ ఫర్ హైడ్రో మెటియరోలాజికల్ ఫోర్కాస్టింగ్ అంచనా వేసింది. బుధవారం ఉదయం థావో నది నీటి మట్టం పెరిగి, దాని సమీప ప్రాంతాలలో వరదలు పోటెత్తుతాయని నేషనల్ సెంటర్ ఫర్ హైడ్రో మెటియోరోలాజికల్ ఫోర్కాస్టింగ్ హెచ్చరిక జారీ చేసింది.
ఉత్తరాదిలోని నదులపై వరద నీటి ప్రభావం ఎక్కువగా ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే థావో నది నీటి మట్టం పెరిగి దాని సమీప ప్రాంతాలు వరదలో చిక్కుకున్నాయి. ఉత్తర ప్రాంతాలలో లోతట్టు, నదీతీర ప్రాంతాల్లో వరదలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. పర్వత ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని హెచ్చరించింది.దశాబ్దాల కాలంలో వియాత్నాంను తాకిన అత్యంత బలమైన తుపాను ఇదేనని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. టైఫూన్ ప్రభావంతో గత శనివారం గంటకు 149 కి.మీ వేగంతో (92 ఎంపిహెచ్) వేగంతో గాలులు వీచాయని తెలిపింది. ఆదివారం బలహీనపడినప్పటికీ, కుంభవృష్టి కొనసాగింది. దీంతో నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయని ఆ ప్రకటనలో తెలిపింది.

More Stories
ఆసియాన్ సదస్సులో వర్చువల్ గా మోదీ
రష్యా చమురు సంస్థలపై ట్రంప్ ఆంక్షలు
మహిళల కోసం జైషే ఆన్ లైన్ ‘జీహాదీ కోర్స్’