హసీనాపై 100కు దాటిన కేసులు .. 1000కు దాటిన మృతులు

హసీనాపై 100కు దాటిన కేసులు .. 1000కు దాటిన మృతులు

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు వ్యతిరేకంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 100ను దాటింది. ఈ కేసుల్లో హత్య, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు సహా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలతో బంగ్లాదేశ్‌ ప్రధాని పదవికి షేక్‌ హసీనా రాజీనామా చేసి, దేశాన్ని విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే.

ఆగస్ట్‌ 13న ఢాకాలో ఆమెకు వ్యతిరేకంగా మొదటి కేసు నమోదవగా, 100 వకేసు అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్‌లో గురువారం ఫైల్‌ అయింది. తాజా కేసులో హసీనాతో పాటు పలువురు మాజీ మంత్రులు, పార్లమెంట్‌ సభ్యులు, జర్నలిస్టులు ఉన్నారు. ఫిర్యాదులో మారణహోమం, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు ఉన్నాయి. వీటిలో 8 అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్‌కు పంపారు. దేశవ్యాప్తంగా వివిధ పోలీస్‌ స్టేషన్‌లలో 92 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 100కి చేరింది. వీటిలో ఒక కిడ్నాప్‌ కేసు కూడా ఉన్నాయి.

మరోవంక, షేక్‌ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవల బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న అల్లర్లలో 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశంలోని ముహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం వెల్లడించింది. ఢాకాలోని రాజర్‌బాగ్‌లో ఉన్న సెంట్రల్‌ పోలీస్‌ ఆసుపత్రిని సందర్శించిన ఆరోగ్య సలహాదారు నూర్జహాన్‌ బేగం ఈ విషయాన్ని వెల్లడించారు. 
 
అలాగే నిరసనకారులను చెదరగొట్టే క్రమంలో పోలీసుల చర్య కారణంగా 400 మందికి పైగా విద్యార్థులు, సామాన్య ప్రజలు తమ కంటిచూపును కోల్పోయారని తెలిపారు. కొందరికి ఒక కన్ను, మరికొందరికి రెండు కళ్లలో చూపు పోయిందని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం కొంతమంది పోలీస్‌ అధికారులు కూడా తలలకు, కాళ్లకు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు నూర్జహాన్‌ బేగం తెలిపారు.
 
ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తాత్కాలిక ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని, క్షతగాత్రులకు ఉచిత చికిత్స అందజేస్తామని సర్కార్‌ హామీ ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు. కాగా, ప్రభుత్వ సర్వీసులలో వివాదాస్పద రిజర్వేషన్‌ కోటాకు వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసనలు ఆ తర్వాత హింసాత్మక ఘర్షణకు దారితీశాయి. దీంతో భారీ మొత్తంలో ప్రాణ నష్టం జరిగింది.