త్వరలో అందుబాటులోకి యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్‌

త్వరలో అందుబాటులోకి యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్‌
యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) గురించి ఇప్పుడు తెలియని వాళ్లు ఉండరు. డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థలో ఇదొక సంచలనం. పేటీఎం, ఫోన్ పే లాంటి యాప్‌ల ద్వారా ఆన్‌లైన్ పేమెంట్‌లు జరిపే ప్రతి ఒక్కరికీ ఇది సుపరిచితమే. గ్రామీణ స్థాయిలోనూ డిజిటల్ చెల్లింపులకు శ్రీకారం చుట్టింది యూపీఐ. 
 
అదే తరహాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇప్పుడు కొత్తగా యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్‌ (యుఎల్ఐ)ను అందుబాటులోకి తీసుకురాబోతున్నది.  మరింత సులభంగా రుణాలను పొందడానికి యూఎల్ఐని తెరపైకి తెస్తోందని ఆర్బీఐ. ఈ ప్లాట్‌ఫామ్ కూడా మరో సంచలనానికి తెర తీస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. 
 
దేశంలో రుణాల మంజూరు వ్యవస్థను మరింత వేగవంతం చేయడం దీని ఉద్దేశం. ఇది లెండింగ్ సెగ్మెంట్‌ను, ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చివేయగలదని భావిస్తున్నారు. రుణాలు పొందడంలో ఇబ్బందులను తొలగించేలా యూఎల్ఐని రూపొందించినట్లు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.కర్ణాటక రాజధాని బెంగళూరులో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్‌పై జరిగిన గ్లోబల్ కాన్ఫరెన్స్‌లో శక్తికాంత దాస్ మాట్లాడారు. పైలట్‌ ప్రాజెక్ట్‌గా యూఎల్ఐని ప్రారంభించినట్లు వివరించారు. ఇందులో ఎదురయ్యే సాంకేతికపరమైన ఇబ్బందులను గుర్తించి పూర్తిస్థాయిలో దేశవ్యాప్తంగా యూఎల్ఐని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. 

డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను రూపురేఖలను యూపీఐ మార్చినట్లే దేశంలో రుణాలు ఇచ్చే విధానాన్ని కూడా యూఎల్ఐ మార్చివేస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. గ్రామీణ రుణ గ్రహీతలకు ఇది మరింత ఉపయోగపడుతుందని, వారి అవసరాలకు అనుగుణంగా దీన్ని రూపొందించినట్లు చెప్పారు. 

జన్‌ధన్ యోజన, ఆధార్‌, యూపీఐ తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థను మరింత వేగంగా పరుగులు పెట్టించేలా, రుణాల జారీని మరింత వేగవంతం చేసేలా యూఎల్ఐ కూడా ఓ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతుందని శక్తికాంత దాస్ వ్యాఖ్యానించారు. జామ్-యూపీఐ-యూఎల్ఐలను ఆయన త్రిమూర్తులుగా అభివర్ణించారు.