రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వి నామినేషన్‌

రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వి నామినేషన్‌
తెలంగాణ నుండి రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్​ సీనియర్​ నేత అభిషేక్​ మను సింఘ్వి శాసససభలో సోమవారం నామినేషన్​ వేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి  రేవంత్​ రెడ్డి, రాష్ట వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్​ మున్షీ, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , పలువురు మంత్రులు పాల్గొన్నారు. 

అభిషేక్ సింఘ్వీది స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబమని మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి తెలిపారు. సింఘ్వీ వల్ల రాష్ట్రానికి అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని తెలిపారు. అభిషేక్​ సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవం కావాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన డా. కేశవరావు రాజీనామాతో ఏర్పడిన ఈ ఖాళీ భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహణకు నోటిఫికేషన్​ ఇచ్చింది. ఈనెల 21వ తేదీ వరకు నామినేషన్​ వేసేందుకు గడువు ఉంది. ఒకే నామినేషన్​ వచ్చినట్లయితే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. లేదంటే వచ్చే నెల 3వ తేదీన ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.

అంతకుముందు హైదరాబాద్​ నానక్​రాంగూడలోని ఓ హోటల్​లో సీఎం రేవంత్​ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్​ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. సీఎం వారందరినీ పార్టీ రాజ్యసభ ఉపఎన్నిక అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీని పరిచయం చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల అమలులో అనేక రాజ్యాంగ, న్యాయపరమైన చిక్కులు, అవాంతరాలు ఉత్పన్నమయ్యాయని పేర్కొంటూ వీటి పరిష్కారం కోసం రాజ్యసభలో, సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు సింగ్వి సహకరిస్తారని చెప్పారు.