రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత హింసాత్మక దశ

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత హింసాత్మక దశ
ప్రపంచమంతా గందరగోళంలో ఉందని.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత హింసాత్మక దశ అని చీఫ్ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సిడిఎస్) జనరల్ అనిల్‌ చౌహాన్‌ వెల్లడించారు. ఢిల్లీలో భారత వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య (ఫిక్కీ) ఆధ్వర్యంలో సైనిక మందుగుండు సామగ్రిపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రపంచ భౌగోలిక రాజకీయ వాతావరణం మారుతున్న స్థితిలో ఉందని తెలిపారు. 
 
రెండు యుద్ధాల కారణంగా ప్రపంచ భద్రతా వాతావరణం మారిపోయిందని, మనం చుట్టూ చూసిన సమయంలో ప్రపంచం కల్లోలం ఉందని కనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు. లిబియా, సిరియా, యెమెన్, అర్మేనియాలో యుద్ధాలు కొంతకాలంగా శాంతించిందని చెప్పారు. కానీ, శాశ్వత శాంతి ఇప్పటికీ అస్పష్టంగా ఉందని, మయన్మార్, సూడాన్, కాంగోలో విభేదాలు ఉన్నాయని వివరించారు.
 
ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న హింసాకాండ రక్షణ సామాగ్రితో సహా ప్రపంచ సరఫరా గొలుసులను ప్రభావితం చేసింది. ఈ పరిణామం భారత్‌కు కూడా ఒక అవకాశమని చౌహన్ స్పష్టం చేశారు. బంగ్లాదేశ్‌లో ఇటీవలి రాజకీయ సంక్షోభం నేపథ్యంలో భారతదేశ సరిహద్దు పరిస్థితులపై స్పందించారు.  భారతదేశానికి భద్రతా సవాళ్లు ఉన్నాయని, జమ్మూ కశ్మీర్‌లో పాక్‌.. చైనాతో చాలాకాలంగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం ఇప్పటికీ కొలిక్కి రాలేదని చెప్పారు.