సల్మాన్‌ ఖుర్షీద్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ అనురాగ్‌ ఠాకూర్‌

సల్మాన్‌ ఖుర్షీద్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ అనురాగ్‌ ఠాకూర్‌
బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతుందో ఇక్కడ కూడా అదే జరగవచ్చని కాంగ్రెస్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్ చేసిన ప్రకటనపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్‌ మండిపడ్డారు. వరుసగా మూడుసార్లు ఓటమిపాలవడంతో దేశంలో అరాచకం సృష్టించాలని కాంగ్రెస్‌ కోరుకుంటోందని దుయ్యబట్టారు. దేశాన్ని తమ గుప్పిటలోకి తీసుకునేందుకు కాంగ్రెస్‌ ఏం చేసేందుకైనా వెనుకాడదని మండిపడ్డారు. 
 
కాంగ్రెస్‌ నేతల ప్రకటనలు ఆ పార్టీ మనస్తత్వాన్ని వెల్లడిస్తున్నాయని ధ్వజమెత్తారు.  సల్మాన్‌ ఖుర్షీద్ ప్రకటనతో మీరు ఏకీభవిస్తారా? అని తాను కాంగ్రెస్‌ నేతలను అనురాగ్‌ ఠాకూర్ ప్రశ్నించారు. కాగా బంగ్లాదేశ్‌ అల్లర్లతో అట్టుడుకుతున్న వేళ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
భార‌త్‌లో సైతం బంగ్లాదేశ్‌ త‌ర‌హా హింసాత్మక నిర‌స‌న‌లు చెలరేగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్‌ ఖుర్షీద్ భార‌త్‌లో అంతా బాగానే క‌నిపిస్తున్నా బంగ్లాదేశ్ మాదిరి హింసాత్మక నిరసనలు తలెత్తే అస్కారం ఉంద‌ని ఆయన హెచ్చరించారు.క‌శ్మీర్‌లోనూ, ఇక్కడ అంతా సవ్యంగానే ఉందని అనిపించినా, కానీ, క్షేత్రస్ధాయిలో ప‌రిస్థితులు వేరే విధంగా ఉన్నాయ‌ని చెప్పారు. నిరంకుశ, నియంత పోకడలు పెచ్చరిల్లితే ప్రజల్లో తిరుగుబాటు మొదలవుతుందని అది బంగ్లా పరిణామాలకు దారితీస్తుందని కాంగ్రెస్‌ సీనియర్ నేత హెచ్చరించారు. సీఏఏ-ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా దేశ రాజధాని షాహిన్ బాగ్‌లో జ‌రిగిన అల్లర్లు దేశ‌వ్యాప్తంగా కలకలం రేపిన విషయాన్ని సల్మాన్ ఖుర్షీద్ గుర్తు చేశారు.