హాకీ సెమీ-ఫైన‌ల్లో భార‌త్

హాకీ సెమీ-ఫైన‌ల్లో భార‌త్

ఒలింపిక్స్‌లో భార‌త పురుషుల హాకీ జ‌ట్టు గ‌త వైభ‌వాన్ని కొన‌సాగిస్తూ సెమీఫైన‌ల్‌కు దూసుకెళ్లింది. విశ్వ క్రీడ‌ల్లో వ‌రుస‌గా రెండోసారి సెమీస్‌కు అర్హ‌త సాధించింది. ఆదివారం జ‌రిగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్లో భార‌త జ‌ట్టుబ్రిట‌న్‌ పై అద్భుతం చేసింది. షూటౌట్‌లో 4-2తో బ్రిట‌న్‌పై జ‌య‌భేరి మోగించి ప‌సిడి ప‌త‌కానికి రెండ‌డుగుల దూరంలో నిలిచింది.

విశ్వ క్రీడ‌ల్లో జోరుమీదున్న భార‌త జ‌ట్టు గోల్డ్ మెడ‌ల్ వేట‌లో మ‌రో అడుగు వేసింది. ప్రీ క్వార్ట‌ర్స్‌లో బ‌ల‌మైన‌ ఆస్ట్రేలియాను 3-2తో ఓడించి 52 ఏండ్ల రికా ర్డు బ్రేక్ చేసిన భార‌త జ‌ట్టు బ్రిట‌న్‌పైనా పంజా విసిరింది. షూటౌట్‌లో తొలుత బ్రిట‌న్ ఆట‌గాళ్లు అల్బెరి జేమ్స్, వాల్లసె జాచ్‌లు గోల్ కొట్ట‌గా.. విలియ‌మ్స‌న్ కొన‌ర్, రోప‌ర్ ఫిలిప్‌లు బంతిని గోల్ పోస్ట్‌లోకి పంప‌లేక‌పోయారు.

భార‌త జ‌ట్టు నుంచి మొద‌ట కెప్టెన్ హ‌ర్మ‌న్‌ప్రీత్ సింగ్, సుఖ్‌జీత్ సింగ్, ఉపాధ్యాయ్ ల‌లిత్ కుమార్, రాజ్ కుమార్ పాల్‌లు గురి త‌ప్ప‌కుండా బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపారు. దాంతో, ఇండియా 4-2తో గెలుపొంది సెమీస్‌లో అడుగుపెట్టింది.  త‌ద్వారా హ‌ర్మ‌న్‌ప్రీత్ సింగ్ సార‌థ్యంలోని టీమిండియా ఈసారి క‌నీసం కాంస్యం ఖ‌రారు చేసింది.

తొలుత ఈ మ్యాచ్‌ 1-1తో టై అవ్వగా, ఆ తర్వాత షూటౌట్‌లో భారత్ 4-2తో గెలుపొందింది. తొలి క్వార్టర్‌లో ఇరు జట్లు ఒక్క గోల్​ కూడా స్కోర్ చేయలేదు. అయితే రెండో క్వార్టర్‌లో భారత్ డిఫెండర్‌ అమిత్‌ రోహిదాస్‌ మ్యాచ్‌కు దూరమయ్యాడు. హాకీ స్టిక్‌తో బ్రిటన్ ఆటగాడిని ఉద్దేశపూర్వకంగా కొట్టాడంటూ రిఫరీలు రోహిదాస్‌ను రెడ్‌ కార్డ్ ద్వారా బయటికి పంపించారు.

దీంతో భారత్ 10 మందితోనే ఆడాల్సి వచ్చింది. సరిగ్గా 22వ నిమిషంలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్ పెనాల్టీ కార్నర్‌ ద్వారా ఓ గోల్‌ సాధించి భారత్‌ను ఆధిక్యంలో నిలిపాడు. ఇక 27వ నిమిషంలో బ్రిటన్ ప్లేయర్ మోర్టన్ లీ గోల్‌ చేయడం వల్ల స్కోర్ సమం అయింది. ఆ తర్వాతి రెండు క్వార్టర్స్‌లోనూ ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. దీంతో మ్యాచ్‌ షూటౌట్‌కు దారితీసింది.