
ఉత్తర్ప్రదేశ్లో శ్రీకృష్ణ జన్మభూమిగా భావించే మధురలో హిందూ, ముస్లిం సంస్థలు గత కొన్ని దశాబ్దాలుగా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. మధుర శ్రీ కృష్ణ జన్మభూమి అని హిందువులు వాదిస్తుండగా, అది షాహీ ఈద్గా మసీదు అంటూ ముస్లిం పక్షాలు కోర్టుల్లో పిటిషన్ల మీద పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ముస్లిం సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేస్తూ అలహాబాద్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.
శ్రీ కృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా మసీదు వివాదంపై తాజాగా విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు ఆర్డర్ 7 రూల్ 11పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ముస్లిం పక్షాలు దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించింది. ఈ మేరకు అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ మయాంక్ కుమార్ జైన్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ఉత్తర్వులు వెలువరించింది. ఈ వివాదానికి సంబంధించిన పిటిషన్ల నిర్వహించేందుకు ముస్లిం పక్షాలు హైకోర్టులో సవాల్ చేయగా ఈ నిర్ణయం వెలువరించింది.
పూజా స్థలాల చట్టం, వక్ఫ్ చట్టం, పరిమితి చట్టం, నిర్దిష్ట స్వాధీన ఉపశమన చట్టాన్ని పేర్కొన్న ముస్లిం పక్షాలు ఇందులో హిందూ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేయాలని వాదించింది. అయితే ముస్లిం పక్షాలు దాఖలు చేసిన ఈ పిటిషన్లను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. అదే సమయంలో సివిల్ దావా నిర్వహణకు సంబంధించి హిందూ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లను స్వీకరించింది.
మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం పక్కన ఉన్న షాహీ ఈద్గా మసీదుపై గత కొన్ని దశాబ్దాల నుంచి వివాదం కొనసాగుతూనే ఉంది. శ్రీ కృష్ణుడి ఆలయాన్ని కూల్చి మసీదును నిర్మించారని ఎప్పటినుంచో హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే గతేడాది 14 డిసెంబర్ వ తేదీన శ్రీ కృష్ణ జన్మభూమి – షాహీ ఈద్గా మసీదు వివాదాస్పద స్థలంలో అలహాబాద్ హైకోర్టు సర్వేను నిర్వహించాలని సంచలన ఆదేశాలు వెలువరించింది. సుప్రీంకోర్టు అడ్వకేట్ కమిషనర్ నేతృత్వంలో ఈ సర్వే నిర్వహించాలని ఆదేశించింది.
ఆ ప్రాంతంలో శ్రీకృష్ణుడి ఆలయం ఉండేదని, మొఘలుల కాలంలో ఆలయన్ని కూల్చేసి మసీదును నిర్మించారని హిందూ సంఘాలు వాదిస్తున్నాయి. ఈ శ్రీ కృష్ణ జన్మభూమి – షాహీ ఈద్గా మసీదు వివాదం 350 ఏళ్ల నుంచి కొనసాగుతోంది. ఇక మసీదుపై మసీదుపై కొన్ని తామర శిల్పాలు, హిందూ పురాణాల్లో ఉండే శేషనాగు ఆకారాలు ఉన్నాయని, వాటినే హిందూ సంఘాలు సాక్ష్యాలుగా పేర్కొంటున్నాయి.
ఆలయాన్ని కూల్చేసి మసీదును నిర్మించారు అనడానికి ఇవే ఆధారాలు అని వాదిస్తున్నారు. 1947 ఆగస్టు 15 వ తేదీన ఉన్న మతపరమైన హోదాను కొనసాగించే 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని ఉటంకిస్తూ ముస్లిం పక్షం ఈ పిటిషన్లను తిరస్కరించాలని కోరింది. 1968లో శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్, \షాహీ మసీదు ఈద్గా ట్రస్ట్ మధ్య ఒప్పందం కుదిరింది. దాని కింద శ్రీ కృష్ణ జన్మభూమి కోసం 10.9 ఎకరాలు, మిగిలిన 2.5 ఎకరాల భూమిని షాహీ ఈద్గా మసీదుకు ఇచ్చారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు