
తెలంగాణలో విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా రాష్ట్రప్రజలకు వీలైనంత ఎక్కువ విద్యుత్ను అందుబాటులో ఉంచాలనుకున్న కేంద్ర ప్రయత్నాలకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించడం లేదని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్లను ఏర్పాటుచేసి 4వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి చేపట్టే ప్రాజెక్టునకు నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందని ఆయన గుర్తు చేశారు.
ఇందులో భాగంగా మొదటి విడతగా 800 మెగావాట్ల సామర్థ్యం గల 2 పవర్ ప్లాంట్లను ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.10,598.98 కోట్లతో చేపట్టిన ఈ రెండు పవర్ ప్రాజెక్టుల్ మొదటి 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ను 3 అక్టోబర్ 2023నాడు, రెండో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ను 4 మార్చ్ 2024నాడు ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ఈ 1600 మెగావాట్ల ప్రాజెక్ట్ లో 85 శాతం విద్యుత్ ను తెలంగాణ అవసరాలకే వినియోగిస్తున్నారు.
ఈ 4వేల మెగావాట్ల ప్రాజెక్టులో మిగిలిన 2400 మెగావాట్ల ప్రాజెక్టును కూడా వీలైనంత త్వరగా ప్రారంభించుకుని, రాష్ట్రంలో విద్యుత్ భద్రత కల్పించాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకు గానూ ఎన్టీపీసీతో రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ టీఎస్ ట్రాన్స్కో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాతే ప్లాంట్ల ఏర్పాటుకు, తగినంత బొగ్గు అందుబాటులో ఉంచుకోవడం మొదలైన అంశాలపై ఎన్టీపీసీ పని ప్రారంభిస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు.
ఒకవైపు, దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టును కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసి విద్యుదుత్పత్తి పెంచాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. దీనికి అనుగుణంగానే పీపీఏ విషయంలో త్వరగా స్పందించి సహకరించాలని.. రాష్ట్ర ప్రభుత్వానికి 4సార్లు లేఖలు రాసినా స్పందన రాలేదని కిషన్ రెడ్డి విమర్శించారు.
ఇన్నిసార్లు లేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి రామగుండంలో కేంద్రం నిర్మించనున్న ఎస్టీపీపీ-II ప్రాజెక్టునుంచి విద్యుత్ కొనుగోలు చేసే ఆసక్తి లేదన్నట్లుగానే భావించాల్సి వస్తుందని ఎన్టీపీసీ లేఖలో పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వానికి ఆసక్తి లేని పక్షంలో దీన్ని దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలకు విక్రయించేందుకు అనుమతి ఉంటుందని కూడా స్పష్టం చేసింది.
30 మే 2024 నాడు దేశవ్యాప్తంగా 250 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. మార్చి 2024లో తెలంగాణలో గరిష్ఠంగా (పీక్ పవర్ డిమాండ్) 15.6 గిగావాట్ల డిమాండ్ ఎదురైంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అంచనాల ప్రకారం 2030 నాటికి తెలంగాణలో పీక్ పవర్ డిమాండ్ ఇప్పుడున్న దానికి రెట్టింపు కానుంది.
దీన్ని దృష్టిలో ఉంచుకుని పెరుగుతున్న పరిశ్రమలు, గృహ అవసరాలకు నిరంతరాయంగా విద్యుత్ ను అందించేందుకు రెండోదశ ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ (2400 మెగావాట్లు)ను వీలైనంత త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావడం అత్యంత అవసరముందని కేంద్ర మంత్రి తెలిపారు. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ పై తొలి హక్కు తెలంగాణ ప్రజలదే అని స్పష్టం చేశారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీపీసీ రాస్తున్న లేఖలపై స్పందించి పీపీఏ చేసుకుంటే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడినట్లు అవుతుందని కిషన్ రెడ్డి హితవు చెప్పారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు