నీట్​ యూజీ పేపర్​ లీక్​ లో మరో ఇద్దరు అరెస్ట్

నీట్​ యూజీ పేపర్​ లీక్​ లో మరో ఇద్దరు అరెస్ట్
నీట్​ యూజీ పేపర్​ లీక్​ వ్యవహారంలో కీలక పాత్రధారులైన మరో ఇద్దరు నిందితులను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) శనివారం అరెస్టు చేసింది. ఇద్దరు రాజస్థాన్ భరత్​పుర్ మెడికల్ స్కూల్​కు చెందిన ​ఎమ్​బీబీఎస్ విద్యార్థులని అధికారులు తెలిపారు. వారిని మంగళం బిష్ణోయ్ శర్మ, దీపేందర్ శర్మగా పోలీసులు గుర్తించారు. దీంతో పేపర్ లీక్ కేసులో అరెస్టైనవారి సంఖ్య 21కి చేరింది.

అంతకుముందు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నగరాలు, పరీక్ష కేంద్రాలవారీగా నీట్ ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ-  ఎన్‌టీఏ వెల్లడించింది. ఫలితాలను వెల్లడించేటప్పుడు విద్యార్థుల గుర్తింపు బహిర్గతం కాకుండా జాగ్రత్తపడింది. నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన 40కిపైగా పిటిషన్లపై ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి వై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. 

ఈ క్రమంలోనే నగరాలు, పరీక్షా కేంద్రాల వారీగా ఫలితాలను శనివారం మధ్యాహ్నం 12 గంటల్లోగా విడుదల చేయాలని  ఎన్‌టీఏ ను ఆదేశించింది. మిగతా కేంద్రాలతో పోలిస్తే అనుమానిత పరీక్ష కేంద్రాల్లో రాసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చాయా లేదా అని తెలుసుకోవడానికే ఈ జాబితా విడుదల చేయాలని కోరుతున్నామని సుప్రీంకోర్టు తెలిపింది.

 ఫలితాలను  ఎన్‌టీఏ   వెబ్ సైట్​లో అప్​లోడ్ చేయాలనీ విద్యార్థుల గుర్తింపు బయటపడకుండా చూడాలని సూచించింది. నీట్ పేపర్‌ లీక్‌ వ్యవహారంపై జులై 22న ధర్మాసనం తదుపరి విచారణ చేపట్టనుంది. నీట్‌లో అక్రమాల నేపథ్యంలో టాప్‌ స్కోర్‌ సాధించిన వారికి మళ్లీ పరీక్ష నిర్వహించగా అందులో ఒక్కరికే 682 మార్కులు వచ్చాయి. 

జూన్‌ 4న వెలువడిన నీట్‌ ఫలితాల్లో 67మందికి మొదటి ర్యాంక్‌ వచ్చింది. అందులో ఒకే కేంద్రంలో పరీక్ష రాసిన ఆరుగురికి 720కి 720 మార్కులు వచ్చాయి. దీంతో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. 1563మందికి గ్రేస్ మార్కులు కలపడటమే అందుకు కారణమని పేర్కొన్న కేంద్రం వాటిని ఉపసంహరించుకుంటున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. వారికి మళ్లీ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది.

గతనెల 23న మళ్లీ పరీక్ష నిర్వహించగా 1563మందిలో 813మంది మాత్రమే హాజరయ్యారు. 720 మార్కులు సాధించిన 67 మంది విద్యార్థుల్లో ఒక్క విద్యార్థికి మాత్రమే 682 మార్కులు వచ్చాయి. 13 మంది విద్యార్థులకు 600కుపైగా మార్కులు వచ్చాయి. తొలుత వెల్లడైన ఫలితాలకు వాటికి మధ్య భారీ వ్యత్యాసం ఉంది. రెండోసారి పరీక్ష తర్వాత నీట్‌ రాసిన అందరి ర్యాంకులు మారినట్లు ఎన్‌టీఏ వెల్లడించింది.