డోనాల్డ్ ట్రంప్ పై ఇరాన్ హత్యాయత్నం!

డోనాల్డ్ ట్రంప్ పై ఇరాన్ హత్యాయత్నం!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇటీవలి హత్యాయత్నం కలకలం రేపుతుండగా, ఇరాన్ ఇటువంటి కుట్రపన్నిన్నట్లు అమెరిగా నిఘా విభాగం పసిగట్టినట్టు తెలుస్తున్నది. నిఘా విభాగం సమాచారం మేరకే బిడెన్ పరిపాలన ఇటీవలి వారాల్లో సీక్రెట్ సర్వీస్ ద్వారా ట్రంప్ చుట్టూ రక్షణను పెంచినట్లు వెల్లడి అవుతుంది.
 
అయితే ట్రంప్ పై హత్యాయత్నం కావించిన వ్యక్తికి ఎటువంటి శక్తులతో, సంస్థలతో సంబంధం లేదని ఇప్పటికే అమెరికా నిఘావిభాగం స్పష్టం చేసింది.  పెన్సిల్వేనియాలో శనివారం నాటి ర్యాలీకి ముందు ఇరాన్ ముప్పు గురించి సీక్రెట్ సర్వీస్, ట్రంప్ ప్రచారానికి తెలిసిందని అమెరికా జాతీయ భద్రతా అధికారిని ఉటంకిస్తూ సిఎన్ఎన్ నివేదించింది. సెమీ ఆటోమేటిక్ రైఫిల్ నుండి బుల్లెట్ ట్రంప్ చెవిని దూకడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది.
 
అయితే, ఈ దాడికి పాలపడిన 20 ఏళ్ల ముష్కరుడు థామస్ మాథ్యూ క్రూక్స్ ఒంటరిగా ప్రవర్తించినట్లు ఇప్పటివరకు ఉన్న అన్ని ఆధారాలు సూచిస్తున్నాయి. కానీ శత్రు విదేశీ ఏజెన్సీ నుండి ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్హ్ హెచ్చరించిన తర్వాత కూడా మెరుగైన భద్రత కల్పించినా  ప్రచార ర్యాలీలో వెల్లడవుతున్న భద్రతా లోపాలు ఇప్పుడు ప్రశ్నలను తలెత్తుతున్నాయి.
 
మాజీ అధ్యక్షుడికి 150 మీటర్ల దూరంలోకి సాయుధుడిని అనుమతించడం తీవ్రమైన భద్రతాలోపంగా స్పష్టం అవుతుంది. 20 ఏళ్ల యువకుడు రైఫిల్‌తో పైకప్పుపైకి వెళ్లడాన్ని చుట్టుపక్కలవారు గమనించి అధికారులను అప్రమత్తం చేసినప్పటికీ భద్రతా సిబ్బంది దాడిని అరికట్టలేకపోవడంపై పలు అనుమానాలకు దారితీస్తుంది.
 
ట్రంప్ ప్రచార ధోరణుల పట్ల ఇరాన్ తీవ్రంగా గమనిస్తున్నట్లు తెలియడంతో అమెరికా  సీక్రెట్ సర్వీస్ అధికారులు ట్రంప్ ప్రచారాన్ని పదేపదే హెచ్చరిస్తున్నట్లు తెలిసింది. బహిరంగ ర్యాలీలను నిర్వహించకుండా, మెరుగైన నియంత్రణకు అవకాశం ఉండేవిధంగా కార్యక్రమాలు నిర్వహించామని సూచించారు.
 
“సీక్రెట్ సర్వీస్, ఇతర ఏజెన్సీలు నిరంతరం కొత్త ముప్పు అవకాశాల గురించిన సమాచారాన్ని అందుకుంటున్నాయి. అవసరమైన విధంగా వనరులను సర్దుబాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాయి” అని అమెరికా సీక్రెట్ సర్వీస్  ప్రతినిధి ఆంథోనీ గుగ్లియెల్మి తెలిపారు. అయితే, ఇరాన్ ముప్పు గురించి తమకు తెలిసిందా? లేదా? అనే విషయాన్ని వెల్లడించడానికి ట్రంప్ ప్రచారం నిరాకరించింది.
 
“అధ్యక్షుడు ట్రంప్ భద్రతా వివరాలపై మేము వ్యాఖ్యానించము. అన్ని ప్రశ్నలను యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్‌కు పంపాలి” అని ప్రచార కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ఇరాన్ వ్యక్తి లేదా సమూహం నుండి నిర్దిష్ట బెదిరింపుల గురించి తమకు ఎటువంటి సమాచారం అందలేదని ట్రంప్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
 
మరోవంక, ట్రంప్‌ను హత్య చేయడానికి ఇరాన్ కుట్ర చేసిందని వస్తున్న కధనాలు  “నిరాధారమైనవి, హానికరమైనవి” అని ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ మిషన్ కొట్టిపారేసింది. “ట్రంప్ ఒక నేరస్థుడు. అతను జనరల్ సులేమానీని హత్య చేయాలని ఆదేశించినందుకు న్యాయస్థానంలో విచారణ జరిపి శిక్షించబడాలి. అతనికి చట్టం పరిధిలోకి తీసుకు వచ్చేందుకు ఇరాన్ చట్టపరమైన మార్గాన్ని ఎంచుకుంది,” అని మిషన్ ప్రతినిధి స్పష్టం చేశారు. 
 
2020లో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కుడ్స్ ఫోర్స్‌కు నాయకత్వం వహించిన సులేమానీని చంపాలని ట్రంప్ ఆదేశించడంతో అమెరికా, ఇరాన్‌ల మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. ప్రతీకారంగా ఇరాన్ తనను హత్య చేయడానికి ప్రయత్నిస్తుందనే భయంతో ట్రంప్ తర్వాత స్నేహితులకు చెప్పినట్లు సమాచారం.
 
సులేమానీ హత్యతో సంబంధాల గురించి అడిగినప్పుడు, ఇరాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అలీ బఘేరీ కనీ “సులేమానీ హత్యకు న్యాయం చేయడానికి” దేశీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో చట్టపరమైన, న్యాయ విధానాలు, ఫ్రేమ్‌వర్క్‌లను టెహ్రాన్ ఉపయోగిస్తుందని తేల్చి చెప్పారు. సైనిక జనరల్ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ పదే పదే ప్రతిజ్ఞ చేసింది. ఆగస్ట్ 2022లో, అమెరికా న్యాయ శాఖ ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన జాన్ బోల్టన్ హత్యకు ప్రయత్నించినందుకు ఐ ఆర్ జి జి సభ్యునిపై నేరారోపణలను ప్రకటించింది.