జవాన్ల వీరమరణంతో రక్షణ మంత్రి ఆగ్రహం … సైన్యానికి స్వేచ్ఛ!

జవాన్ల వీరమరణంతో రక్షణ మంత్రి ఆగ్రహం … సైన్యానికి స్వేచ్ఛ!
జమ్మూ డివిజన్‌ దోడాలో సోమవారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో కెప్టెన్‌ సహా నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. ఈ ఘటనపై యావత్‌ భారతమంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేదీతో మాట్లాడారు. నలుగురు సైనికులు అమరులు అయిన నేపథ్యంలో ఎలాంటి చర్యలైనా తీసుకునేందుకు స్వేచ్ఛ ఇస్తున్నట్టు ఆర్మీ చీఫ్‌కు రక్షణమంత్రి చెప్పారు. 
 
ఇక ఎన్‌కౌంటర్‌కు సంబంధించి దోడాలో పరిస్థితులు, కొనసాగుతున్న ఆపరేషన్ గురించి అడిగి తెలుసుకున్నారు.  ఉగ్రవాదాన్ని రూపుమాపి ఈ ప్రాంతంలో శాంతిభద్రతలను నెలకొల్పేందుకు కట్టుబడి ఉన్నామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. దోడాలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో జవాన్లు వీరమరణం పొందారని తెలిసి బాధపడ్డానని చెప్పారు.

అమరజవాన్ల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు దేశం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, ఉగ్రవాద అంతం చేయడానికి, ఈ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించేందుకు సైనికులు కట్టుబడి ఉన్నారని తెలిపారు.

 ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, భారత సైన్యంలోని అన్ని స్థాయి అధికారులు దోడాలో తమ ప్రాణాలను అర్పించిన వీర జవాన్లకు నివాళులర్పించారు. ఈ దుఃఖ సమయంలో భారత సైన్యం మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తోంది అని పేర్కొన్నారు. జమ్మూ ప్రాంతంలో ఇటీవల జరిగి రెండో అతిపెద్ద దాడి ఇదేనని అధికారులు చెబుతున్నారు. 

గతవారం కథువాలో ఐదుగురు సైనికులు మరణించారని, ఆ తర్వాత ఇదే అతిపెద్ద ఎన్‌కౌంటర్ అని చెప్పారు. కాగా జమ్మూ ప్రాంతంలో తీవ్రవాదాన్ని నిర్మూలించేందుకు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను పూర్తి స్థాయిలో చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ గత నెలలో ఆర్మీని కోరారు. దీంతో బలగాలు రంగంలోకి దిగి జల్లెడ పడుతూ ఉగ్రమూకలను ఏరివేస్తున్నాయి.

అదే సమయంలో సైన్యం, పోలీసులపై ఉగ్రవాదులు జరిపిన దాడికి తప్పనిసరిగా ప్రతీకారం తీర్చుకుంటామని జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు ఎల్‌జీ మనోజ్‌ సిన్హా సంతాపం ప్రకటించారు. బలిదానాలకు ఖచ్చితంగా ప్రతీకారం తీసుకుంటామని హెచ్చరించారు.

అమరులైన జవాన్ల కుటుంబాలకు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ సంతాపం ప్రకటిస్తూనే బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. భారత సైన్యంపై ఉగ్రదాడులు పెరగడం ఆందోళనకరమని చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో భారత సైనికులపై ఉగ్రదాడులు ఆందోళన కలిగిస్తున్నాయని, ఇందుకు బీజేపీ తప్పుడు విధానాలే కారణమని మండిపడ్డారు.