ఉస్మానియాలో మీడియాపై పోలీసుల దాడి

ఉస్మానియాలో మీడియాపై పోలీసుల దాడి
ఉస్మానియా యూనివ‌ర్సిటీ మెయిన్ లైబ్ర‌రీ వ‌ద్ద మీడియా ప్ర‌తినిధుల ప‌ట్ల పోలీసులు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు. డీఎస్సీ అభ్య‌ర్థుల ఆందోళ‌న‌ల‌ను క‌వ‌రేజ్ చేసేందుకు వెళ్లిన జీ తెలుగు రిపోర్ట‌ర్ ప‌ట్ల పోలీసులు అమ‌ర్యాద‌గా ప్ర‌వ‌ర్తించారు. జీ తెలుగు రిపోర్ట‌ర్ చొక్కా ప‌ట్టుకుని లాక్కెళ్లారు.  నేను జ‌ర్న‌లిస్టును.. మీ ప‌ని మీరు చేసుకోండి.. మా ప‌ని మేం చేసుకుంటాం అంటుంటే కూడా పోలీసులు వినిపించుకోలేదు. ఆ రిపోర్ట‌ర్‌ను బ‌ల‌వంతంగా పోలీసు వాహ‌నంలో ఎక్కించి పోలీసులు త‌మ పైత్యాన్ని ప్ర‌ద‌ర్శించారు.
 
జర్నలిస్టులపై పోలీసుల దాడులను మీడియా ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. పోలీసుల వైఖరికి నిరసనగా సచివాలయం మీడియా పాయింట్ వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులపై దాడులు చేయడం, వారిని అరెస్టు చేయడం మీడియా స్వేచ్చను హరించడమేనని మండిపడ్డారు. ఓయూలో కవరేజీకి వెళ్ళిన జీ న్యూస్ రిపోర్టర్, వీడియో జర్నలిస్టును అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద మహిళా జర్నలిస్టుతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు.
 
జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును టీజేఎఫ్ తీవ్రంగా ఖండించింది. విధి నిర్వహణలో భాగంగా జర్నలిస్టులు వార్తలు కవర్ చేయడానికి వెళ్తే పోలీసులు అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించింది. జర్నలిస్టుల పట్ల పోలీసులు అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని మార్చుకోవాలని తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర డీఎస్సీ వాయిదా కోసం పోరాటం చేస్తున్న విద్యార్థులతో పాటు జర్నలిస్ట్ లపై కూడా పోలీసులు చేయి చేసుకోవడాన్ని బిజెపి రాష్ట్ర అధికార ప్రయిత్నిది రాణి రుద్రమ తీవ్రంగా ఖండించారు.   తెలంగాణ ఉద్యమ సమయంలో వలస కాంగ్రెస్ పాలనలో తెలంగాణ యూనివర్సిటీ లు ఏ విధంగా పోలీసుల లాఠీ దెబ్బలతో రక్త మొడినయో మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో అదే పోలీసుల ధమనకాండ కనిపిస్తుందని ఆమె ధ్వజమెత్తారు.

హోంశాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.  ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంబమైన మీడియా ప్రతినిదిని చొక్కా పట్టుకుని లాక్కెళ్లడం ప్రశ్నించే గొంతుల పై ఉక్కు పాదం మోపడమే అని ఆమె విమర్శించారు.