ఆగస్టు 11న నీట్‌ -పిజి పరీక్షలు

నీట్-పీజీ ప్రవేశ పరీక్షను ఆగస్టు 11న రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ శుక్రవారం ప్రకటించింది. నీట్-పీజీ 2024 నిర్వహణను రీషెడ్యూల్ చేసినట్లు తెలిపింది. నీట్-పీజీ పరీక్షను 2024 ఆగస్టు 11న రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. నీట్-పీజీ 2024 పరీక్షకు హాజరు కావడానికి కటాఫ్ తేదీ 2024 ఆగస్టు 15గా కొనసాగుతుందని బోర్డు నోటిఫికేషన్ లో తెలిపింది. 
 
నీట్ యూజీ 2024 పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో, ముందు జాగ్రత్త చర్యగా కేంద్రం జూన్ 22న నీట్-పీజీ 2024 పరీక్షను వాయిదా వేసింది.  కొన్ని పోటీ పరీక్షల సమగ్రతపై ఇటీవల వచ్చిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని వైద్య విద్యార్థుల కోసం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ నిర్వహించే నీట్-పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ప్రక్రియల పటిష్టతను క్షుణ్ణంగా అంచనా వేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. 
 
వైద్య విద్యార్థుల కోసం ఎన్బీఈఎంఎస్ తన సాంకేతిక భాగస్వామి టీసీఎస్ తో కలిసి నిర్వహించే  నీట్-పీజీ   పరీక్ష ప్రక్రియల పటిష్టతను క్షుణ్ణంగా పరిశీలిస్తామని మంత్రిత్వ శాఖ తెలిపింది.  దేశవ్యాప్తంగా వైద్య కళాశాలలు అందించే అన్ని పోస్ట్ ఎంబీబీఎస్ డీఎన్బీ కోర్సులు, పోస్ట్ ఎంబీబీఎస్ డైరెక్ట్ ఆరేళ్ల డీఆర్ఎన్బీ కోర్సులు, ఎన్బీఈఎంఎస్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నీట్-పీజీ  పరీక్షను నిర్వహిస్తారు. 
 
నీట్-పీజీతో పాటు యూజీసీ-నెట్ పరీక్షను కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. యుజిసి- నెట్ పరీక్ష ఆగస్టు- సెప్టెంబర్ లో జరుగుతుంది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ మంజూరుకు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి, పీహెచ్ డీ కోర్సుల్లో ప్రవేశానికి యూజీసీ-నెట్  పరీక్ష ద్వారా అర్హతను నిర్ణయిస్తారు.
 
కాగా, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్)  యూజీసీ-నెట్ జూలై 25 నుంచి 27 వరకు జరగనుంది. పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ముందస్తు చర్యగా ఈ పరీక్షను గతంలో వాయిదా వేశారు. కెమికల్ సైన్సెస్, ఎర్త్, అట్మాస్ఫియరిక్, ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్లో పీహెచ్డీ ప్రవేశాలకు సీఎస్ఐఆర్ యూజీసీ-నెట్ స్కోర్ ను అర్హతగా పరిగణిస్తారు.
 
దేశవ్యాప్తంగా వైద్యవిద్యలో ప్రవేశాల కోసం ఏటా నిర్వహించే నీట్ యూజీ పరీక్ష ఈసారి అత్యంత వివాదాస్పదమైంది. ఎన్నడూ లేనంతగా పేపర్ లీక్ వివాదాలు తలెత్తడం, సీబీఐ రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించడం, అరెస్టులు చోటు చేసుకోవడంతో ఈ ప్రభావం నీట్ పీజీ పరీక్షపైనా పడింది. దాంతో గత నెల 23న జరగాల్సిన నీట్ పీజీ పరీక్ష వాయిదా పడింది.
పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నీట్-పీజీ పరీక్ష నిర్వహిస్తున్నారు. పలు జాగ్రత్తలతో పరీక్ష నిర్వహణకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. లీకుల ఆరోపణల నేపథ్యంలో నీట్ పీజీ పరీక్ష ప్రశ్నాపత్రాన్ని పరీక్షకు కేవలం రెండు గంటల ముందు మాత్రమే తయారు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నీట్ యూజీ పరీక్షలో లీకుల వ్యవహారంపై వచ్చిన ఫిర్యాదులపై విచారణకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కమిటీని నియమించారు. అలాగే నీట్ రీ టెస్ట్ కూడా రద్దయింది. దీన్ని జూలై 25- 27 తేదీల్లో నిర్వహించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది.