జూనియర్ డాక్టర్ల సమ్మె విరమణ

తెలంగాణాలో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం జూనియర్ డాక్టర్లతో జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమిస్తున్నట్లు జూడాలు ప్రకటించారు. ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యా లు,స్టైపెండ్ బకాయిలు వెంటనే చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో జూ డాలు గురువారం నుంచి విధులకు హాజరుకానున్నారు.

జూనియర్ డాక్టర్లు గతంలో రెండు సార్లు స్టైపెండ్‌ల విడుదల గురించి తమ దృష్టికి తెచ్చారని, చాలా ఏళ్లుగా సమస్యలు ఉన్నాయని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. గ్రీ న్ ఛానెల్ ద్వారా స్టైపెoడ్, వసతి భవనాలు ఏర్పాటు చేయాలని, వైద్యులకు రక్షణ కావాలని కోరారని, దీనిపై జరిగిన చర్చలు ఫలించాయని వెల్లడించారు. 

జూడాలు ఉస్మానియా, గాంధీ ఆసుపత్రి వసతి గృహాలపై ఫిర్యాదు చేశారని తెలిపారు. వసతి గృహాల్లో సౌకర్యాలు మెరుగుపరచాలని కోరారని చెబుతూ జూనియర్ డాక్టర్లు లేవనెత్తిన సమస్యలపై సిఎం రేవంత్ రెడ్డి స్పందించారని పేర్కొన్నారు. సిఎం ఆదేశాల మేరకు ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులను సందర్శించామని వెల్లడించారు. 

ఉస్మానియా ఆసుపత్రిలో సౌకర్యాల కోసం రూ.121 కోట్లు విడుదల చేశామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. అలాగే గాంధీ ఆసుపత్రి కోసం రూ.80 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. కాకతీయ ఆసుపత్రికి సీసీ రోడ్డు మంజూరు చేశామని, వైద్య సౌకర్యాలు మెరుగుపరిచేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.

ఉస్మానియా ఆసుపత్రి విషయం కోర్టులో ఉందని మంత్రి గుర్తు చేస్తూ ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనాలు నిర్మించేందుకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. ఉస్మానియా గురించి సరైన సమయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. పేదలకు వారివారి ప్రాంతాల్లోనే వైద్య చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 

వైద్యశాఖ విధానాల్లో కూడా మార్పులు తీసుకువస్తున్నామని చెబుతూ పేదల ప్రజలకు విద్య, వైద్యం అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఆసుపత్రుల్లో మంచి భోజనం అందించాలని ఆదేశించామని,  డ్రగ్స్, హెల్త్ ల్యాబ్‌లను ఆధునీకరిస్తున్నామని వైద్యశాఖ మంత్రి వెల్లడించారు. మొబైల్ ఫుడ్ ల్యాబ్స్ సంఖ్య పెంచుతున్నామని, ఫుడ్, డ్రగ్స్ ల్యాబ్‌లని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు.