
తెలంగాణాలో ఆగస్టు 15 లోపు రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీ అమలుకు విధివిధానాలపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అర్హులైన వారికే రుణమాఫీ వర్తింపజేసేందుకు పాస్బుక్లు, రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని తాజాగా అధికారులు సూచించినట్లు తెలిసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆదాయపన్ను చెల్లించే వారు, ఉద్యోగులను దీని నుంచి మినహాయించాలని కేబినెట్ సమావేశ ఎజెండాలో ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
పంట రుణాల మాఫీపై ఈ వారంలో సమావేశం నిర్వహించాలని సర్కార్ భావిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశించడంతో వ్యవసాయాధికారులు రూ.2 లక్షల వరకు రుణాలు తీసుకున్న వారి జాబితాను బ్యాంకుల నుంచి తెప్పిస్తున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో ఈ జాబితా అధికారుల వద్దకు చేరనుంది.
ఈలోపే రుణమాఫీని ఎవరెవరికి అమలు చేయాలనే దానిపై వ్యవసాయశాఖ వివిధ ప్రామాణికాల ప్రాతిపదికన విస్తృతస్థాయిలో అధ్యయనం చేస్తోందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. రైతుబంధు పథకం కింద తెలంగాణలో 66 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో రూ.2 లక్షల లోపు రుణాలు పొందినవారు దాదాపు ఇంత మందే ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
మరోవైపు రైతుబంధు లబ్ధిదారుల్లో దాదాపు 6 లక్షల మందికి పట్టాదారు పాస్బుక్లు లేవు. వాటిని ప్రామాణికంగా తీసుకుంటే రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య 60 లక్షలకు తగ్గుతుందని అధికారులు అంటున్నారు. మరోవైపు కుటుంబంలోని ఇద్దరు, ముగ్గురికి రైతుబంధు వస్తోంది. వారందరికీ రేషన్ కార్డుల్లేవు. కుటుంబ పెద్దకు మాత్రమే ఉంది.
రేషన్కార్డు నిబంధన పెడితే కుటుంబంలో రైతుకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని, తద్వారా మరో 18 లక్షల మంది తగ్గే అవకాశం ఉందని అధికారులు నివేదిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపన్ను చెల్లింపుదారులు ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మినహాయిస్తే మరో రెండు లక్షల మంది తగ్గుతారని అధికారులు అంటున్నారు.
ఇటువంటి నిబంధనలతో 40 లక్షల మంది మేరకే రుణమాఫీ పథకం పరిధిలోకి వస్తారని అధికారులు నివేదిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 36 లక్షల మందికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద సాయం అందుతోంది. రుణమాఫీ కోసం ఈ పథకం విధివిధానాల మీదా చర్చ నడుస్తున్నా ఆ నిబంధనలను యథాతథంగా దీనికి వర్తింపజేయడం ఇబ్బందికరంగా మారుతుందని సర్కార్ భావిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తేదీని పరిగణనలోకి తీసుకొని అంతకు సంవత్సరం ముందు నుంచి తీసుకున్న రుణాలనే మాఫీ చేయాలని కొందరు అధికారులు ప్రతిపాదించారు. దీనికి సర్కార్ విముఖత చూపింది. 2018 డిసెంబర్ 12 నుంచి తీసుకున్న పంట రుణాలు, రెన్యువల్ అయిన వాటికి మాఫీ అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకనుగుణంగా రుణగ్రహీతల వివరాలను సేకరించాలని సూచనలు చేసింది.
రుణమాఫీకి సంబంధించి పలు ప్రతిపాదనలు రాగా దీనిపై కేబినెట్లో సమగ్రంగా చర్చించాకే నిర్ణయం తీసుకోవాలని సర్కార్ భావిస్తోంది. అర్హులకు దీనిని వర్తింపజేయాలని యోచిస్తోంది. అమలు క్రమంలో గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకు విజిలెన్స్ సెల్ ఏర్పాటు సన్నాహాల్లో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
More Stories
జమ్ముకశ్మీర్లో 12 మంది పాక్ చొరబాటుదారులు కాల్చివేత
హైదరాబాద్ లో పురుషాంగం పునఃసృష్టి
బీసీ కులగణన కాంగ్రెస్ కుట్ర