క్షిపణి రహస్యాలను పాక్ కు చేరవేసిన ఇంజనీర్ కు జీవిత ఖైదు

భారత్‌‌కు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేశాడన్న ఆరోపణలతో అరెస్ట్ అయిన భారత మాజీ ఇంజనీర్‌కు కోర్టు శిక్ష విధించింది. ఏకంగా జీవిత ఖైదుతో పాటు జరిమానా కూడా విధించింది. బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాజీ ఇంజనీర్ నిశాంత్ అగర్వాల్‌కు మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లా కోర్టు సోమవారం శిక్ష వేసింది. 

నిశాంత్ అగర్వాల్‌కు 14 ఏళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.3 వేల జరిమానా విధించింది. నాగ్‌పూర్‌లోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ టెక్నికల్ విభాగంలో పనిచేసిన నిశాంత్ అగర్వాల్‌ను 2018 లో ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్రలకు చెందిన మిలిటరీ ఇంటెలిజెన్స్.. యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా పక్కా ప్లాన్ ప్రకారం అరెస్ట్ చేశాయి.

పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐకు.. బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించిన కీలక సమాచారాన్ని అందించిన ఆ సంస్థ మాజీ ఇంజనీర్ నిశాంత్ అగర్వాల్‌కు ఐటీ చట్టంలోని సెక్షన్ 66 (ఎఫ్), అధికారిక రహస్యాల చట్టంలోని పలు సెక్షన్ల కింద దోషిగా తేల్చినట్లు అదనపు సెషన్స్ కోర్టు జడ్జి ఎంవీ దేశ్‌పాండే తీర్పులో వెల్లడించారు. నిషాంత్ అగర్వాల్.. బ్రహ్మోస్ ఫెసిలిటీలో 4 ఏళ్ల పాటు పనిచేశాడు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్‌- ఐఎస్ఐకి సున్నితమైన సాంకేతిక సమాచారాన్ని లీక్ చేసినట్లు అతనిపై ఆరోపణలు రాగా అరెస్ట్ చేశారు.

బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి రూపకల్పన, అభివృద్ధి, మార్కెటింగ్‌కు బాధ్యత వహిస్తున్న బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థ.. భారతదేశ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ – డీఆర్‌డీఓ, రష్యా సైనిక పారిశ్రామిక కన్సార్టియం మషినోస్ట్రోయెనియా సంయుక్తంగా నిర్వహించిన ప్రాజెక్టు. అయితే అగర్వాల్‌కు గత ఏప్రిల్‌లో బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ బెయిల్ మంజూరు చేయగా.. తాజాగా నాగ్‌పూర్ జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది.