దక్షిణాఫ్రికాలో మెజారిటీ కోల్పోయిన అధికార ఏఎన్‌సీ

దక్షిణాఫ్రికాలో మెజారిటీ కోల్పోయిన అధికార ఏఎన్‌సీ
దక్షిణాఫ్రికా పార్లమెంట్‌ ఎన్నికల్లో అధికార ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (ఏఎన్‌సీ) పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. తెల్లవారి వర్ణవివక్ష నుంచి దేశాన్ని విముక్తి చేసిన ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు చెప్పారు. శనివారం విడుదలైన చారిత్రక ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. 
 
తెల్లవారి పాలన అంతం చేసి అధికారం చేపట్టిన 30 ఏండ్ల అప్రతిహత ఏఎన్‌సీ పాలనకు ఆ దేశ ప్రజలు వీడ్కోలు పలుకుతూ విభిన్నమైన పాఠం చెప్పారు.
 బుధవారం జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (ఎఎన్‌సి) తన మెజారిటీని కోల్పోయింది. శనివారానికి 99శాతానికి పైగా ఓట్ల లెక్కింపు పూర్తయిన నేపథ్యంలో ఎఎన్‌సికి 41 శాతం ఓట్లు లభించాయి. 
 
దీంతో రాబోయే ఐదేళ్ల కాలానికి ఎఎన్‌సి తన పట్టును నిలబెట్టుకోనుంది. ఆదివారం అధికారికంగా తుది ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. దామాషా పద్దతిలో జరిగిన ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినదీ నిర్దిష్టంగా గురువారం వెల్లడిస్తారు. అయితే 2019లో ఎఎన్‌సికి 52 శాతం ఓట్లు రాగా, ఈసారి అది 41 శాతానికి తగ్గింది. ఆ మేరకు ప్రత్యర్థులు లాభపడ్డారు. 
 
ప్రధాన ప్రతిపక్షమైన డెమోక్రటిక్‌ అలయెన్స్‌ (డిఎ) 2019లో సాధించిన 17.05శాతానికి మరో 4.26శాతం ఓట్లు కలుపుకుని మొత్తంగా 21.31శాతం ఓట్లు వచ్చాయి. మరో ప్రతిపక్షమైన ఇఎఫ్‌ఎఫ్‌కు గత ఎన్నికల్లో 11.06శాతం ఓట్లు రాగా, ఈసారి ఆ వాటా 13.09శాతానికి పెరిగింది. ఫ్రీడమ్‌ ఫ్రంట్‌ ప్లస్‌ పార్టీకి 3.71శాతం నుండి 2.49శాతానికి ఓట్లు తగ్గాయి.
 
ఏఎన్‌సీ నుంచి విభేదించి బయటకు వచ్చిన మాజీ అధ్యక్షుడు జాకబ్‌ జుమాకు చెందిక ఎంకే పార్టీకి 14 శాతం ఓట్లు, ద ఎకనమిక్‌ ఫ్రీడమ్‌ ఫైటర్స్‌కు 9 శాతం వచ్చాయి. విపక్షాలకు చెందిన 50 పార్టీలు ఈ ఎన్నికల్లో పోటీపడ్డాయి. ఈ ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందని మరో పార్టీ ఎసిటి (ఆఫ్రికన్‌ కాంగ్రెస్‌ ఫర్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌) నేత విమర్శించారు. ఆ పార్టీకి కేవలం 1.39శాతం ఓట్లే వచ్చాయి. పోలింగ్‌లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వెస్ట్రన్‌ కేప్‌లోని ప్రతిపక్ష పార్టీలు రీకౌంటింగ్‌కు డిమాండ్‌ చేశాయి.