ప్రతిపక్ష నేతల డబ్బులపై ప్రత్యేక నిఘా

ప్రతిపక్ష నేతల డబ్బులపై ప్రత్యేక నిఘా

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన అదనపు ఎస్పీ తిరుపతన్న ఇచ్చిన వాంగ్మూలాన్ని సైతం పోలీసులు తాజాగా బయటపెట్టారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రభాకర్‌రావు, భుజంగరావు ఆదేశాలతో, బీఆర్‌ఎస్‌ ప్రత్యర్థులపై మెరుపు దాడులు నిర్వహించి డబ్బులు పట్టుకున్నట్లు వెల్లడించారు. 

ఈ విధమైన చర్యలు కోసం ఇద్దరు సీఐలు, 20 మంది కానిస్టేబుళ్లతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసుకున్నామని, రోజుకు 40 నుంచి 50 మంది సెల్‌ఫోన్లను ట్యాపింగ్‌ చేసినట్లు చెప్పారు. 3 ఉపఎన్నికలతో పాటు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లో తాను పనిచేసినట్లు తెలిపారు.

ఇందులో భాగంగా ‘పీఓఎల్‌- 2023’ పేరుతో ప్రత్యేక ఎలక్షన్ వాట్సాప్‌ గ్రూపును ఏర్పాటు చేసినట్లు వివరంచారు. కొన్ని సందర్భాల్లో ఎస్‌ఓటీ, టాస్క్‌ఫోర్స్‌లతో కలిసి పనిచేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రణీత్‌రావు ఇచ్చిన సమాచారంతో విపక్షాల సానుభూతిపరుల నుంచి డబ్బులను సీజ్‌ చేసినట్లు చెప్పారు. 

కొల్లూరులో రేవంత్‌ రెడ్డి మిత్రుడు గాలి అనిల్‌కుమార్ నుంచి రూ.90 లక్షలు, మరో మిత్రుడు కె.వినయ్‌రెడ్డి నుంచి రూ.1.95 కోట్లు సీజ్ చేసినట్లు తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రాఘవ ఇన్‌ఫ్రా నుంచి రూ.10.5 కోట్లు, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మిత్రుడు వేణు దగ్గర రూ.3 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 

ఎమ్మెల్యే వినోద్‌కు సంబంధించిన విశాఖ ఇండస్ట్రీస్ నుంచి రూ.50 లక్షలు, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మిత్రుడు గిరిధర్ నుంచి రూ.35 లక్షలు, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి నుంచి రూ.90 లక్షలు, ఖమ్మంలో మంత్రి పొంగులేటి మరో మిత్రుడు, ఫెర్టిలైజర్ సంస్థ యజమాని వద్ద రూ.10 లక్షలు సీజ్ చేసినట్లు వెల్లడించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో, కామారెడ్డిలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకొని, ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి, రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డిపై నిఘా పెట్టినట్లు తెలిపారు. మొత్తం 300 మంది సెల్ ఫోన్లు, ట్యాప్‌ చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించడంతో, తన దగ్గర ఉన్న 3 కంప్యూటర్లతో పాటు 9 లాగర్స్‌లో ఉన్న డేటా మొత్తం ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే దశాబ్దాల తరబడి సేకరించిన మావోయిస్టుల సమాచారం సైతం ధ్వంసం అయినట్లు తెలిపారు.