ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్ దేశంలోనే టాప్‌

దేశంలో ఐటీ రంగంలో కొత్త నియామకాలు నెమ్మదిస్తున్నా, హైదరాబాద్‌ మాత్రం నియామకాల జోరును కొనసాగిస్తోంది. ఏప్రిల్‌ నెలలో హైదరాబాద్‌లో 41.5 శాతం ఐటీ నియామకాలు పెరిగాయి. ఈ మేరకు ఇండీడ్‌ అనే ఆన్‌లైన్‌ జాబ్‌ సెర్చింగ్‌ సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం హైదరాబాద్‌ తర్వాతి స్థానంలో బెంగళూరు ఉంది.

ఇక్కడ 24 శాతం ఐటీ నియామకాలు పెరిగినట్లు ఇండీడ్‌ తన నివేదికలో పేర్కొంది. ఐటీ నిపుణుల కోసం అగ్ర గమ్యస్థానాలుగా, ఈ నగరాలకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ఇండీడ్‌ నివేదిక ప్రతిబింబిస్తోంది. ఇండీడ్‌ వెబ్‌సైట్‌ జాబ్‌ క్లిక్‌లలో కూడా హైదరాబాద్‌, బెంగళూరు గణనీయమైన వృద్ధి సాధించాయి.

హైదరాబాద్‌లో పనిచేసేందుకు 161 శాతం ఉద్యోగార్థులు ఆసక్తి కనబర్చారు. ఇక బెంగళూరుపై 80 శాతం మంది ఆసక్తి చూపినట్లు నివేదిక పేర్కొంది. అయితే ప్రపంచ ఆర్థిక పరిస్థితి, అనిశ్చితి కారణంగా నియామకాలు చేపట్టేందుకు ఐటీ కంపెనీలు ఆకస్తి చూపించడం లేదని తెలిపింది. ఈ కారణాల వల్ల దేశవ్యాప్తంగా ఐటీ రిక్రూట్‌మెంట్లు 3.6శాతం తగ్గుముఖం పట్టాయని కూడా ఇండీడ్‌ వెల్లడించింది.

అంతేకాకుండా ఏపీఐ, జావాస్క్రిప్ట్‌, ఎస్క్యూఎల్‌, అజైల్‌ వంటి సాంకేతికతల్లో నియామకాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపింది. ప్రస్తుతం ఏఐ సాంకేతికత అన్ని రంగాలను డామినేట్‌ చేస్తోంది. ముఖ్యంగా ఐటీ రంగంలో దీని వినియోగం క్రమంగా పెరుగుతోంది.

ఈ క్రమంలో కంపెనీలు కూడా ఏఐ నైపుణ్యం కలిగిన ఉగ్యోగార్థులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇలాంటి వారికి 50శాతం అధిక వేతనం ఇవ్వడానికి కూడా వెనుకాడటం లేదు. ఈ మేరకు ఇలాంటి ట్రెండ్లను ఎప్పటికప్పుడు ఫాలో అయ్యే ప్లాట్ఫామ్‌ Levels.FYI ఓ నివేదిక విడుదల చేసింది.