శ్రీలంకలో సీతమ్మ వారి పునః ప్రతిష్ట

శ్రీలంకలో సీతమ్మ వారి పునః ప్రతిష్ట

శ్రీలంకలో సీతమ్మ వారి పునః ప్రతిష్ట , శుద్ధికి అయోధ్యలోని సరయూ నది జలాలు వినియోగించారు. లంక సీతమ్మకు అయోధ్య రాముడి నుంచి పలు అపురూప కానుకలు , తీపి వంటకాలు, పండ్లు పూలు కూడా పంపించారు. రామాయణంలోని సీతమ్మకు లంకకు ఉన్న చేదు బంధం గురించి తెలిసిందే.  అయితే ఇక్కడ సీతా ఎలియా గ్రామంలో సీతామాతకు ఓ గుడి ఉంది.

ఆదివారం ఈ దేవాలయంలో పెద్ద ఎత్తున పూజాదికాలు, మంత్రోచ్ఛారణల నడుమ కైంకర్యాలు నిర్వహించారు. ముందుగా సరయూ నది నుంచి ప్రత్యేకంగా జలం తీసుకు వచ్చారు.  ఈ జలంతో అమ్మవారి విగ్రహానికి ముందుగా శుద్ధి కార్యక్రమం చేపట్టారు. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు.

భారతీయులు, లంకేయులు,నేపాలీలు జై సీతారాం నినాదాల నడుమ భక్తి భావనతో వచ్చారు. కుంభాభిషేక ఘట్టానికి విశేష స్పందన దక్కిందని భారతీయ హై కమిషన్ తెలిపింది .  ఆలయ సందర్శనకు భారత హై కమిషనర్ సంతోష్ ఝా, ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ ఇతర ప్రముఖులు తరలివచ్చారు. కాగా రాముడి జన్మస్థలం అయోధ్య, సీత పుట్టిల్లుగా భావించే నేపాల్ నుంచి అనేకానేక పవిత్ర కానుకలు, ముడుపులు తరలించారు.

భారతదేశంలోని వడికిన చీరలు, నేపాల్‌కు చెందిన విశేష వస్తువులు, స్వీట్లు లడ్డూలను ఈ ఘట్టానికి పెద్ద ఎత్తున తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం తరఫున ఆత్మీయ కట్నంగా పంపించారు. 

లంకలోని ఎలియా ప్రాంతంలోనే రావణుడు సీతను ఇక్కడి అశోక వాటికలో బంధించాడని, ఈ క్రమంలో ఆ తర్వాత అక్కడ వెలిసిన ఆలయం పూజలందుకుందని చెపుతారు. కాగా ఇటీవలే ఈ ఆలయాన్ని రవిశంకర్ ఇతరుల సహకారంతో పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారు. ఈ క్రమంలోనే పునః ప్రతిష్ట జరిగింది.