మళ్లీ అధికారంలోకి వస్తున్నామని జగన్ ధీమా

మళ్లీ అధికారంలోకి వస్తున్నామని జగన్ ధీమా
ఈ ఎన్నికల ఫలితాల్లో తాము ఖచ్చితంగా గెలుస్తున్నామని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జూన్‌ 4న వచ్చే ఫలితాలను చూసి దేశం మొత్తం ఆశ్చర్య పోతుందని తెలిపారు.  రానున్న ఎన్నికల ఫలితాల్లో తాము 22ఎంపీ సీట్లను గెలుస్తున్నామని జగన్ ప్రకటించారు. 

ప్రశాంత్ కిషోర్ ఊహించనన్ని సీట్లను తాము గెలుస్తున్నామని చెప్పారు. రానున్న ఐదేళ్లలో కూడా ప్రజలకు మరింత మేలు అందిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో కూడా తమ ప్రయాణం ఇలాగే కొనసాగుతుందని తెలిపారు.

‘‘ఏపీలో వచ్చే ఫలితాలను చూసి దేశం మొత్తం ఆంధ్రావైపే చూస్తుంది. గతంలో 151 అనేదే చాలా పెద్ద నెంబర్.. 22 ఎంపీ స్ధానాలు కూడా చాలా పెద్ద సంఖ్యే.. ఈసారి 151 కంటే ఎక్కువ స్ధానాలు, 22 ఎంపీ స్ధానాలు కంటే ఎక్కువ సాధిస్తాం’’ అని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.

జగన్మోహన్‌ రెడ్డి విజయవాడ బెంజి సర్కిల్‌ సమీపంలో ఉన్న ఐపాక్ కార్యాలయానికి వెళ్లి ఐపాక్‌ బృందంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఐ పాక్ ఉద్యోగులను పేరుపేరున పలకరించారు. ఐప్యాక్ టీమ్ ఈసారి కూడా వైసీపీకి ఎన్నికల సర్వేలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘మీరు ఏడాదిన్నరగా అద్భుతంగా పనిచేశారు. మీ కృషి వల్లే టార్గెట్‌ను సాధించగలుగుతున్నాం. రిషీ చేసిన ఎఫర్ట్ కూడా చాలా గొప్పది. చాలా మందికి ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తున్నారో తెలియడం లేదు. ప్రశాంత్ కిషోర్ కన్నా రిషీ టీం చాలా వర్తీ. ఏపీ రిజల్ట్స్ దేశంలోని ప్రతీ ఒక్కరిని ఆశ్చర్యపరుస్తాయి. జూన్ 4న వచ్చే నెంబర్లు గతంలో ప్రశాంత్ సాధించిన వాటికన్నా గొప్పగా వస్తాయి. ఎన్నికల తరువాత కూడా మీ టీం సేవలు కొనసాగించండి’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.

 సీఎం జగన్‌తో పాటు మంత్రులు బొత్సా సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నందిగం సురేష్, శ్రీకాంత్ రెడ్డిలు ఉన్నారు. శుక్రవారం సిఎం జగన్ విదేశీ పర్యటనకు వెళుతున్న నేపథ్యంలో గురువారం ఐప్యాక్‌ కార్యాలయానికి వచ్చారు. ఐ ప్యాక్ బృందంతో భేటీ సందర్భంగా మరోసారి అధికారంలోకి వస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఐపాక్‌ ఉద్యోగులు సిఎం సిఎం నినాదాలతో హోరెత్తించారు.