ఈదురు గాలులకే  కుప్పకూలిన వంతెన

పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లిజిల్లాలను కలుపుతూ ఓడేడు గ్రామ సమీపంలోని మానేరు వాగుపై నిర్మిస్తున్న వంతెన సోమవారం అర్ధరాత్రి కూలిపోయింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల మధ్య దూరభారా న్ని తగ్గిస్తూ వరంగల్‌కు రాకపోకలు సు లువుగా జరిగేలా వీలుగా 2016లో బిఆర్‌ఎస్ ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణం పనులకు రూ.49 కోట్లు మంజూరు చేసింది. 

అప్పట్లో పనులు ప్రారంభించినా, మధ్య లో కాంట్రాక్టు మారడంతోపాటు నిధులు లేమి తదితర కారణాలతో నిర్మాణం ఆలస్యమైంది. రెండవ దఫా రూ.11 కో ట్లు అంచనా పెంచి కొత్త కాంట్రాక్టర్‌తో పనులు ప్రారంభించారు. బ్రిడ్జి నిర్మాణం పనులు ఆలస్యం కావడంతో మానేరులో తాత్కాలిక మార్గంలో వేసిన మట్టి రోడ్డుపై ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు.

అర్ధరాత్రి సమయంలో బలమైన ఈదురు గాలులు వీచడంతో వంతెన కూలింది. వంతెన కూలడానికి ఒక నిమిషం ముందు అదే ప్రాంతం నుంచి వెళ్తున్న 60 మంది పెళ్లి బృందం బస్సుకు తృటిలో భారీ ప్రమాదం తప్పింది. పగటిపూట ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉన్న సమయంలో వంతెన కూలినట్లయితే భారీ ప్రాణ నష్టం చోటుచేసుకునేదని, అదృష్టవశాత్తూ రాత్రి సమయం కావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని గ్రామస్థులు అంటున్నారు. 

మంగళవారం ఉదయం ఆ ప్రాంతం నుంచి వెళ్తున్న పలువురు వ్యక్తులు వంతెన కూలడాన్ని గమనించిన పోలీసులకు సమాచారం ఇచ్చారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో వంతెన నిర్మాణంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాలెన్స్ కోసం పెట్టిన చెక్కలు చెదలు పట్టడంతో గట్టర్లు ఒకవైపు వంగిపోయాయి. నిర్మాణం పనుల్లో అలసత్వంతోనే ఈ వంతెన కూలినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.

ఇప్పటికైనా బ్రిడ్జి నిర్మాణం పనులు వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో జరిగేలా చూడాలని పలువురు కోరుతున్నారు. ఇదిలావుండగా, ఈ ఘటనపై మంత్రి శ్రీధర్‌బాబు తీవ్రంగా స్పందిస్తూ మానేరు వాగుపై కూలిన వంతెన ఘటనకు సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఘటనపై విచారణకు సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.