కవిత బెయిల్ పిటిషన్‌పై మే 2న తీర్పు

కవిత బెయిల్ పిటిషన్‌పై మే 2న తీర్పు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు లో బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత సిబిఐ బెయిల్ పిటిషన్‌పై ఇరువైపులా వాదనలు ముగిశాయి. మే 2న తుది తీర్పు వెలువడనున్నది. కవిత తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. పిఎంఎల్‌ఎ సెక్ష న్ 45 ప్రకారం బెయిల్‌కు కవిత అర్హురాలు అని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. 

ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారని, ఇడి కస్టడీ లో ఉన్న కవితను సిబిఐ ఎందుకు అరెస్టు చేసిందని ప్రశ్నించారు. అరెస్ట్ చేయాల్సిన అవసరం లేకున్నా, కవిత ను అరెస్టు చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. బిఆర్‌ఎస్‌కు కవిత స్టార్ క్యాంపెయినర్ అని కోర్టుకు తెలిపిన ఆమె తరపు న్యాయవాది, ఏడేళ్లలోపు శిక్ష పడే కేసులకు అరెస్టు అవసరం లేదన్నారు.

మరోవైపు కవితకు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును సిబిఐ కోరింది. కవిత దర్యాప్తును ప్రభావితం చేయగలరన్న సిబిఐ తరఫు న్యాయవాది, లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తిగా ఉన్నారని పేర్కొన్నారు. ఇరువైపులా వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు, తీర్పును రిజర్వ్ చేసింది. కవిత బెయిల్ పిటిషన్‌పై న్యాయస్థానం మే 2న తుది ఉత్తర్వులు ఇవ్వనుంది. 

సిబిఐ కేసులో బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసిన వెంటనే, ఇడి కేసులో బెయిల్ పిటిషన్‌పై వాదనలు ప్రారంభమయ్యాయి. కవిత తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, విచారణకు సహకరిస్తున్న కవితను అరెస్ట్ చెయ్యాల్సిన అవసరం లేదని కోర్టుకు వెల్లడించారు. అరుణ్ రామచంద్రన్ పిళ్లై 10 స్టేట్‌మెంట్‌లు ఇచ్చారని, కవితకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు.

అనుమానితురాలిగానూ లేని కవితను నిందితురాలిగా మార్చారని, విచారణకు హాజరైన సమయంలో కరడుగట్టిన నేరస్థుల్లా చూశారని తెలిపారు. మార్చి 15న ఆమెను అక్రమంగా అరెస్ట్ చేశారన్న సింఘ్వి, కవిత – కేజ్రీవాల్‌లను కలిపి విచారించడంలో ఇడి విఫలమైందన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) లో విజయ్ నాయర్ సోషల్ మీడియా వ్యవహారం చూస్తారని, ఆయనతో సోషల్ మీడియా అంశంపై మాత్రమే భేటీ అయినట్లు వివరించారు. 

బుచ్చిబాబు నాలుగు స్టేట్‌మెంట్‌లు ఇచ్చారన్న కవిత తరఫు న్యాయవాది సింఘ్వీ, ఇడికి అనుకూలంగా స్టేట్‌మెంట్ ఇచ్చాకే ఆయనకు బెయిల్ వచ్చిందని ఆరోపించారు. శరత్‌రెడ్డి, బిజెపి ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన వ్యక్తి అని, వారిచ్చిన స్టేట్‌మెంట్స్ ఆధారంగా కవితను అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. కవిత వాడిన అన్నీ మొబైల్ ఫోన్లను ఇడికి ఇచ్చామని ఆమె న్యాయవాది సింఘ్వీ, మొత్తం 6 ఫోన్లు అందించినట్లు తెలిపారు. కవిత తరపు న్యాయవాది వాదనల అనంతరం తదుపరి విచారణను రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.