జగన్ పై దాడి కేసులో నిందితునిగా బోండా ఉమా!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాయి దాడి కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా పేరు తెరపైకి తీసుకొచ్చారు. ఆయన డైరెక్షన్ లోనే ఈ దాడి జరిగిందని వైసీపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు.  కేసులో ఆయనను నిందితుడిగా చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతుంది.
రాయి దాడి కేసులో ప్రధాన నిందితుడు వేముల సతీష్‌కుమార్‌ను పోలీసులు ఏ1గా చూపించారు. ఏ2గా టీడీపీ కార్యకర్త వేముల దుర్గారావును చూపించినట్టు లీకులు వచ్చాయి. తాజాగా జరుగుతున్న పరిణామాలతో ఏ2 ఎవరన్న ప్రశ్న తలెత్తుతోంది. కోర్టులో సతీష్‌ను ప్రవేశపెట్టినప్పుడు పోలీసులు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో ఏ2 ఎవరన్నది స్పష్టం చేయలేదు. ఏ2 ప్రేరేపించడంతో సతీష్‌ దాడి చేశాడని పేర్కొన్నారు.
విజయవాడ మొగల్రాజపురంలోని బొండా ఉమా ఇంటి వద్ద, అజిత్‌సింగ్‌ నగర్‌లో పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం రాత్రి హైడ్రామా నడిచింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా పోలీసులు పార్టీ కార్యాలయం వద్దకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు వచ్చిన సమాచారం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో కార్యాలయం వద్దకు చేరుకున్నారు.
 
బొండా ఉమా ఇంటి వద్దకు శుక్రవారం ఉదయం ఇద్దరు కానిస్టేబుళ్లు వెళ్లారు. భద్రత నిమిత్తం తమను పంపారని ఆయనకు చెప్పారు. మధ్యాహ్నానికి ఆ సంఖ్య నాలుగుకు చేరింది. దీంతో బొండా ఉమాకు అనుమానం వచ్చింది. తర్వాత కారులో ఇంటి నుంచి అజిత్‌సింగ్‌ నగర్‌లోని పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. 
 
కాసేపటికి టాస్క్‌ఫోర్స్‌ అధికారులు, లా అండ్‌ ఆర్డర్‌ అధికారులు పార్టీ కార్యాలయానికి సమీపంలో వేచి ఉన్నారు. తర్వాత పోలీసు సిబ్బంది చేరుకున్నారు. దీంతో బొండా ఉమాను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. పోలీసుల రాకను గమనించిన నేతలు అన్ని డివిజన్లలో ఉన్న కార్యకర్తలకు సమాచారం ఇచ్చారు. 
 
20 డివిజన్లలో ఉన్న కార్యకర్తలు భారీ సంఖ్యలో పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. వెల్లంపల్లి డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. రాత్రి వరకు బొండా ఉమా పార్టీ కార్యాలయంలోనే ఉండి నేతలతో సమావేశమయ్యారు. జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. పార్టీ కార్యాలయం వద్ద సుమారు రెండున్నర గంటలపాటు హైడ్రామా నడిచింది. 
 
కార్యకర్తలు వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరించారు. అయినా వారు అక్కడి నుంచి కదల్లేదు. పోలీసులు ఏ క్షణాన అయినా లోపలకు ప్రవేశించి అరెస్టు చేస్తారన్న అనుమానంతో బొండా ఉమా అక్కడి నుంచి తప్పించుకున్నారు. పార్టీ కార్యాలయానికి విద్యుత్‌ సరఫరాను నిలుపుదల చేయించి, వెనుక వైపు నుంచి వెళ్లిపోయారు.