కెనడాలో భారతీయ విద్యార్ధిని కాల్చిచంపిన దుండుగులు

కెనడాలో మరో భారతీయ విద్యార్ధి హత్యకు గురయ్యాడు. రెండు రోజుల కిందట దక్షిణ వాంకోవర్‌లోని అతడ్ని దుండుగులు కాల్చి చంపినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. హత్యకు గురైన భారతీయ యువకుడ్ని హరియాణకు చెందిన చిరాగ్ ఆంటిల్ (24)గా గుర్తించారు. కాల్పుల శబ్దం విని స్థానికులు ఘటనా స్థలికి చేరుకునేసరికి కారులో చిరాగ్‌ విగతజీవిగా పడి ఉన్నాడని వాంకోవర్ పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు. 
 
‘‘తూర్పు 55 అవెన్యూ‌లోని ప్రధాని వీధిలో ఏప్రిల్ 12న రాత్రి 11 గంటల సమయంలో తుపాకీ కాల్పుల శబ్దం విన్న స్థానికులు.. అధికారులకు సమాచారం ఇచ్చారు. చిరాగ్ ఆంటిల్ (24) అనే వ్యక్తి వాహనంలో చనిపోయాడు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్టు చేయలేదు.. విచారణ కొనసాగుతోంది’ అని పేర్కొన్నారు.
 
ఈ ఘటనపై కాంగ్రెస్ విద్యార్ధి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు వరుణ్ చౌదరి ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ బాధిత కుటుంబానికి సాయం చేయాలని కోరుతూ విదేశాంగ శాఖను ట్యాగ్ చేశాడు.
 
 ‘కెనడాలోని వాంకోవర్‌లో చిరాగ్ ఆంటిల్ అనే భారతీయ విద్యార్థి హత్య ఘటనపై తక్షణ దృష్టి పెట్టండి. దర్యాప్తు పురోగతిని నిశితంగా పరిశీలించి, త్వరగా న్యాయం జరిగేలా చూడాలని విదేశాంగ మంత్రిత్వ శాఖను కోరుతున్నాం.. ఈ క్లిష్ట సమయంలో చిరాగ్ కుటుంబానికి అవసరమైన మద్దతు, సహాయాన్ని అందించాలని అభ్యర్థిస్తున్నాం’ అని చౌదరి పేర్కొన్నారు.
 
చిరాగ్ మృతదేహాన్ని భారత్‌కు రప్పించేందుకు అతడి కుటుంబం క్రౌడ్ ఫండింగ్ వేదిక గోఫండ్ ద్వారా విరాళాలు సేకరిస్తున్నట్టు స్థానిక మీడియా తెలిపింది. చిరాగ్ అంటిల్ సోదరుడు రోమిత్ మాట్లాడుతూ.. మా అన్నయ్య చాలా మంచి వ్యక్తి అని వాపోయాడు.
 
 ‘మా అన్నయ్య, నాకు మంచి అనుబంధం ఉంది. మేము ప్రతి రోజూ మాట్లాడుకునేవాళ్లం. ప్రమాదం జరగడానికి ముందు నేను చివరిగా మాట్లాడాను. చాలా సంతోషంగా ఉన్నాడు.. ఎవరితోనూ ఎటువంటి సమస్యలు లేదా గొడవలు లేవు.. అందరితోనూ ఫ్రెండ్లీగా ఉంటాడు’ అని రోమిత్ కన్నీటిపర్యంతమయ్యాడు.
సెప్టెంబరు 2022లో ఉన్నత విద్యకోసం వాంకోవర్ వెళ్లిన చిరాగ్ యూనివర్సిటీ కెనడా వెస్ట్‌లో ఎంబీఏ పూర్తి చేశాడు. ఇటీవలే తన వర్క్ పర్మిట్ పొందాడు.