ఇజ్రాయెల్పై పెద్ద ఎత్తున పోరుకు తాము సిద్ధం అవుతున్నామని ఇరాన్ హెచ్చరించడంతో భారత్ తో సహా దాడులకు అవకాశం ఉందని భావిస్తున్న 28 దేశాల్లో తమ రాయబార కార్యాలయాలను భద్రతా కారాయణల దృష్ట్యా ఇజ్రాయిల్ మూసివేసింది. భారత్ లో ఢిల్లీ, ముంబైలలో కార్యాలయాలను మూసివేసింది.
డమాస్కస్లో జరిగిన హత్య తరువాత ఇరాన్ నుండి బెదిరింపులు పెద్ద ఎత్తున రావడంతో ఇజ్రాయెల్ దౌత్యవేత్తలలో ప్రతీకార దాడులు జరగవచ్చని భయపడుతున్నారు. దేశ అంతర్గత భద్రతా విభాగం అయిన షిన్ బెట్తో సమన్వయంతో ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన హై అలర్ట్ను అనుసరించి ఇజ్రాయెల్ మిషన్లు మూసివేతున్నారు.
అమెరికా, ఇతర దేశాలు ఇజ్రాయెల్ తరఫున నిలవరాదని, తరువాతి పరిణామాలకు వారిదే బాధ్యత అని కూడా ఈ సందర్భంగా ఇరాన్ హెచ్చరించింది. మీరు మధ్యలో తలదూర్చరాదని అమెరికాకు శనివారం ఇరాన్ చురకలకు దిగడంతో అసలే గాజా యుద్ధంతో రగిలిపోతున్న పశ్చిమాసియా పరిస్థితి మరింత దిగజారింది.
సిరియాలోని తమ కాన్సులేట్పై ఇజ్రాయెల్ దాడి చేయించిందని ఇరాన్ అనుమానిస్తోంది. ప్రతీకారంతో రగిలిపోతోంది. అయితే ఈ అంశంలో తాము చర్య తీసుకోబోనున్న నేపథ్యంలో జోక్యం చేసుకోవద్దు అని అమెరికాను ఇరాన్ కోరింది. దీనిపై ఇరాన్ పొలిటికల్ అఫైర్స్ చీఫ్ జామ్సిది ప్రకటన చేశారు. నెతన్యహూ వేసిన ఉచ్చులో పడిపోవద్దు అని జామ్సిది తన ప్రకటనలో తెలిపారు.
అయితే ఇప్పటి వరకు అమెరికా మాత్రం ఇరాన్ హెచ్చరిక గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు స్పష్టం అవుతోంది. కాగా వెస్ట్ ఆసియాలో ఇరాన్ పరోక్ష శక్తి అయిన హెజ్బోల్లా కూడా ఇజ్రాయెల్ను ఇక దెబ్బకాచుకో అని హెచ్చరించింది. దీనితో ఇజ్రాయెల్ నేత నెతన్యాహు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇజ్రాయిల్ వలలో పడరాదని ఇరాన్ ఏకంగా ఓ లేఖను అమెరికా అధికార యంత్రాంగానికి పంపించింది. ఇరాన్ అధ్యక్షుడికి అత్యంత కీలక సన్నిహితులు, రాజకీయ సలహాదారుడి పేరిట ఎక్స్లో కూడా ఈ సందేశం వెలువరించారు. పక్కకు తప్పుకోండి లేకపోతే దెబ్బ తప్పదనే రీతిలో ఈ ఘాటు సందేశం పంపించారు.
ఈ లేఖపై అమెరికా వెంటనే స్పందించింది. తమ స్థావరాలపై దాడికి దిగకుండా ఉంటే మంచిదని తెలిపింది. రంజాన్ మాసం చివరి శుక్రవారం ముగిసిన తరువాత ఇజ్రాయెల్పై పవిత్రదాడులకు దిగాలని ఇరాన్ సంకల్పించినట్లు, దీనితో ఈ ప్రాంతంలో భీకరపోరు పరిస్థితి తప్పదని పరిశీలకులు భావిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ పరిస్థితిని అయినా ఎదుర్కోవాలని ఇజ్రాయెల్కు అమెరికా సూచించింది.
మరోవైపు తమ దేశపు స్థావరాల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలకు దిగింది. ఇజ్రాయెల్లో ఉన్న అమెరికా సైనిక లేదా ఇంటలిజెన్స్ కేంద్రాల వద్ద నిశిత నిఘాను పెంచారు. పర్యవేక్షణ ఉధృతం చేశారు. తమకు డమాస్కస్లో ఇరాన్ కాన్సులేట్పై జరిగిన దాడికి ఎటువంటి సంబంధం లేదని, వార్తల్లోనే ఈ విషయం తెలిసిందని బైడెన్ అధికార యంత్రాంగం ఇరాన్కు తెలియచేసింది.
కాగా ఇజ్రాయెల్ తమ బద్ధశత్రువు అని, దెబ్బకు దెబ్బతీసి తీరుతామని ఇరాన్ హెచ్చరించింది. అయితే ఇరాన్ సేనలు నేరుగా ఇజ్రాయెల్పై విరుచుకుపడుతాయా? లేక తమ పరోక్ష శక్తుల సాయంతో దాడులు నిర్వహింపచేస్తారా? అనేది వెల్లడికాలేదు. ఓ వైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగడం, ఇప్పటికీ గాజాలో రణరంగం నెలకొని ఉంటున్న దశలోనే ఇప్పుడు అత్యంత కీలక సమానబల వైరి పక్షాలు ఇరాన్ ఇజ్రాయెల్ తలపడితే పరిస్థితి ఏమిటనేది అంతర్జాతీయ ఆందోళనకు దారితీసింది.
ఇలా ఉండగా, గాజాలో జరిగిన ఇజ్రాయిల్ డ్రోన్ దాడిలో ఏడు మంది ఎన్జీవో ఛారిటీ సిబ్బంది మృతిచెందిన ఘటన పట్ల ఇజ్రాయిల్ మిలిటరీ ఇద్దరు ఆఫీసర్లను తొలగించినట్లు చెప్పింది. మరో ముగ్గురు అధికారుల్ని నిలదీసింది. కీలకమైన సమాచారాన్ని ఇజ్రాయిలీ సైనిక దళాలు తప్పుగా వాడుకున్నాయని, ఆర్మీ రూల్స్ను వాళ్లు ఉల్లంఘించినట్లు మిలిటరీ పేర్కొన్నది.
హమాస్ దళాన్ని టార్గెట్ చేస్తున్నట్లు అంతర్గతంగా అంచనా వేయడం వల్ల ఆ ఘటన జరిగిందని మిలిటరీ తెలిపింది. ఇజ్రాయిల్ జరిపిన దాడిలో వరల్డ్ సెంట్రల్ కిచన్ సంస్థకు చెందిన సిబ్బంది మృతిచెందారు. తీవ్రమైన తప్పిదం వల్ల ఆ మరణాలు సంభవించినట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ పేర్కొన్నది.
More Stories
ప్రైవేటు వ్యక్తుల పక్షాన ప్రభుత్వం పిటిషన్ వేయడమా?
ఖలిస్థానీ నినాదాలపై కెనడా రాయబారికి సమన్లు
ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే మత ప్రాతిపాదక రిజర్వేషన్లు