పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీ తరపున హైదరాబాద్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొంపెల్ల మాధవీలతకు కేంద్రం కమాండోలతో భద్రత కల్పించింది. ఆమెకు వై+ భద్రత కల్పిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్లో ఎంఐఎం అభ్యర్థి, ప్రస్తుత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై మాధవీలత పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
వీఐపీ సెక్యూరిటీలో భాగంగా మాధవీలతకు 11 మంది సిబ్బంది సెక్యూరిటీగా ఉంటారు. ఆరుగురు సిఆర్పిఎఫ్ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఆమె వెంట నిత్యం పహారా కాస్తారు. మరో ఐదుగురు సాయుధులైన గార్డులు ఆమె నివాసం వద్ద సెక్యూరిటీగా ఉండనున్నారు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్రం వై+ సెక్యూరిటీ కల్పిస్తోన్న సంగతి తెలిసిందే.
మాధవీ లత ప్రముఖ విరించి హాస్పిటల్స్ చైర్ పర్సన్గా ఉన్నారు. ఈమె గత కొంతకాలంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. హైదరాబాద్ యాకుత్పురా నియోజకవర్గం సంతోశ్నగర్లో పుట్టి పెరిగిన మాధవీలత ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. భరతనాట్య నృత్యకారిణి, ఆర్టిస్ట్, ఫిలాసఫర్, ఎంటప్రిన్యూర్ అయిన మాధవీలత విరించి గ్రూఫ్ ఫౌండర్ కొంపెల్ల విశ్వనాథ్ను 2001లో వివాహం చేసుకున్నారు.
ఈమె లతామా ఫౌండేషన్ ఛైర్పర్సన్గా కూడా వ్యవహరిస్తున్నారు. రెండేళ్లుగా పాతబస్తీ వేదికగా గోశాలతో పాటు భారీ యజ్ఞశాల ఏర్పాటు చేసి హిందూ వైదిక కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. కాగా, పాతబస్తీలో ఓటమి అంటే ఎరుగని అసదుద్దీన్ ఓవైసీపై ఆమె పోటీ చేస్తున్నారు. గత నాలుగు పర్యాయాలు ఓవైసీ ఇక్కడి నుంచి ఎంపీగా గెలుపొందగా, ఆయన్ను ఓడించి తీరుతానని మాధవీలత చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సున్నితమైన పాతబస్తీలో ఆమె పర్యటించాల్సి ఉండటంతో కేంద్రం వై+ సెక్యూరిటీ కల్పించింది.
More Stories
రజాకార్ల గుప్పిట్లో నుండి హైదరాబాద్ విముక్తికై బిజెపికి ఓటు
తెలంగాణలో పోలింగ్ సమయం పెంపు
దిశ ఎన్కౌంటర్ కేసులో హైకోర్టులో పోలీసులకు ఊరట