కవిత మధ్యంతర బెయిల్‌పై సోమవారం తీర్పు

ఢిల్లీ మద్యం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్‌ మంజురు చేసే అంశంపై తీర్పును ఈడీ ప్రత్యేక కోర్టు రిజర్వ్‌ చేసింది. కవిత కుమారుడికి త్వరలో పరీక్షలు జరగనున్నాయని, ఈ సమయంలో ఒక తల్లిగా కుమారుడితో ఉండాల్సిన అవసరం ఆమెకు ఉందని కవిత తరఫు న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదించారు. 

అయితే, రాజకీయ నేరస్థులకు ఇలాంటి భావోద్వేగపూరిత కారణాలు వర్తించబోవని ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న ఈడీ ప్రత్యేక కోర్టు న్యాయాధికారి కావేరీ బవేజా తీర్పును రిజర్వు చేసి, ఏప్రిల్‌ 8న  ఉదయం 10.30 గంటలకు మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై తుది ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు వెలువరిస్తామని తెలిపారు.

 కాగా కవితకు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసే విషయంపై ఈ నెల 20 నుంచి వాదనలు వింటామని బవేజా పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం కేసులో కవిత కీలకపాత్ర పోషించినందున, ఈ దశలో ఆమెకు బెయిల్‌ మంజూరు చేయడం సబబు కాదని ఈడీ తరఫున న్యాయవాది జోహెబ్‌ హుస్సేన్‌ వాదించారు. మనీ లాండరింగ్‌ వంటి అవినీతి కార్యకలాపాలకు పాల్పడిన రాజకీయ నేతలకు.. మహిళలు అన్న మినహాయింపుతో బెయిల్‌ ఇవ్వొద్దని కోరారు. 

ఈ కేసులో ముడుపులు తరలించడంలో ప్రధాన పాత్ర పోషించిన కవిత మద్యం వ్యాపారంలో లబ్ధి కూడా పొందారని, సాక్ష్యాలను ధ్వంసం చేశారని తెలిపారు. నగదు మళ్లించినట్లు రుజువు చేసే బ్యాంకు ఖాతాలు, వాట్సాప్‌ డాక్యుమెంట్లు తమ వద్ద ఆధారాలుగా ఉన్నాయని స్పష్టం చేశారు. 

ఈడీకి తన మొబైల్‌ ఫోన్లను అందజేసే ముందు వాటిలోని సమాచారాన్ని కవిత తొలగించారని, ఇతర నిందితులు కూడా ఇదే పని చేశారని, మొత్తంగా వందకుపైగా మొబైళ్లలో సమాచారాన్ని తుడిచిపెట్టి, ధ్వంసం చేశారని తెలిపారు. దర్యాప్తులో కీలకమైన సమాచారాన్ని రాబట్టే దశలో ఉన్నామని, కవితకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వటం వల్ల దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని తెలిపారు.

తన సీఏ బుచ్చిబాబుతోపాటు పలువురు సాక్షులు తమ స్టేట్‌మెంట్లను మార్చుకోవలసిందిగా కవిత ఒత్తిడి చేశారని తెలిపారు. ఈ మేరకు కవిత బినామీ అరుణ్‌ పిళ్లై తన స్టేట్‌మెంట్‌ను వెనక్కి తీసుకున్న విషయాన్ని హుస్సేన్‌ గుర్తు చేశారు. 

కవిత కుమారుడు పరీక్షల కారణంగా ఆందోళనకు గురవుతున్నారని అనడానికి ఎలాంటి సాక్ష్యాలు లేవని, ఒక్క మెడికల్‌ డాక్యుమెంట్‌ కూడా ఈ విషయంలో తమకు సమర్పించలేదని తెలిపారు. కవిత కుటుంబ సభ్యులు, ఆమె ముగ్గురు సోదరీమణులు ఆమె కుమారుడికి పరీక్షల సమయంలో అవసరమైన మానసిక మద్దతు ఇవ్వగలరని ఆయన చెప్పారు. ఆమె కుమారుడి పరీక్షల్లో కొన్ని ఇప్పటికే అయిపోయాయని కోర్టు దృష్టికి తెచ్చారు.