ఢిల్లీలో ఆదివారం జరిగిన ఇండియా కూటమి ర్యాలీలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన “మ్యాచ్ ఫిక్సింగ్” వ్యాఖ్యలు, ఇతర విమర్శల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయనపై “కఠినమైన చర్యలు” తీసుకోవాలని బిజెపి సోమవారం ఎన్నికల సంఘాన్ని కోరింది.
బీజేపీకి ఈ ఎన్నికలు మ్యాచ్ ఫిక్సింగ్ అని, ఈసీలో ప్రభుత్వం సొంత మనుషులున్నారని, మోదీ ఈవీఎంలు లేకుండా గెలవలేరని పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. తాము ఈ విషయాలన్నింటినీ ఈసీ దృష్టికి తీసుకువచ్చామని, ఈ ఆరోపణలను ఈసీ తోసిపుచ్చిందని, వీటన్నింటికి సరైన ఆధారాలు లేవని పేర్కొందని చెప్పారు.
భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కేంద్ర పాలకులు లాగేసుకున్నారని రాహుల్ ఆరోపించారని, కాషాయ పార్టీకి 400 సీట్లు దక్కితే రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని ఓ బీజేపీ కార్యకర్త చెప్పారని రాహుల్ అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. అలా అని ఏ కార్యకర్త చెప్పాడో తమకు తెలియదని ఆయన పేర్కొన్నారు. ఇండియా విపక్ష కూటమి చీలిపోతోందని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీకి కేవలం నోటీసు జారీ చేస్తే సరిపోదని, ఆయనపై కఠిన చర్యలు చేపట్టాలని హద్దీప్ పూరి డిమాండ్ చేశారు.
కాగా, దేశంలో ప్రజాస్వామ్యం హత్యకు గురైందని రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా బహుశా రాహుల్ గాంధీకి ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థం తెలియదేమో అంటూ మండీ లోక్సభ బిజెపి అభ్యర్థి కంగనా రనౌత్ ఎద్దేవా చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మండి జిల్లాలోని భీమకాళీ ఆలయం పరిసరాల్లో బీజేపీ జరిపిన సమావేశంలో ఆమె పాల్గొంటూ ప్రజాస్వామ్యం హత్యకు గురైతే ప్రజలకు మద్దతుతో పని ఉండదని వ్యాఖ్యానించారు.
‘దేశంలో ప్రజాస్వామ్యం హత్యకు గురైతున్నట్లయితే ఇప్పుడు మనమంతా దేనికి సిద్ధమవుతున్నాం? ఎందుకు ప్రజలను ఆకర్షిస్తున్నాం? ఎందుకు వారి మద్దతు కోరుతున్నాం? మనం ప్రజల నమ్మకం, మద్దతు, సహకారం కోరుకుంటున్నాం. ఇదంతా ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనా?’ అని కంగనా ప్రశ్నించారు. ‘మనం ప్రజల మద్దతు కోరుతున్నమంటే దాన్ని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అనరు. అసలు ప్రజాస్వామ్యం అంటేనే ఇది. బహుశా రాహుల్ గాంధీకి ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థం తెలియదేమో ’ అని కంగనా సెటైరికల్ కామెంట్ చేశారు.
More Stories
వయనాడ్లో ఓటమి భయంతో రాయ్బరేలి బరిలో
రాజ్యాంగం మారుస్తామని కాంగ్రెస్ అసత్య ప్రచారం
రాయ్బరేలీ కాంగ్రెస్ అభ్యర్థిగా రాహుల్ గాంధీ