దేశ వ్యాప్తంగా భారీ విధ్వంసానికి ఐఐటీ విద్యార్థి కుట్ర

ఐఐటీలో చదువుతున్న ఓ విద్యార్థి ఐసిస్ ఉగ్రవాద గ్రూపులో చేరి దేశ వ్యాప్తంగా భారీ విధ్వంసానికి కుట్ర పన్నాడనే విషయం సంచలనం సృష్టిస్తోంది. ఎట్టకేలకు అతన్ని పట్టుకుని పోలీసులు విచారిస్తున్నారు. అసోంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఐఐటీ గౌహతికి చెందిన విద్యార్థి బయోటెక్నాలజీలో చదువుతున్నాడు.

ఇటీవల అతను అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. అంతకుముందు సోషల్ మీడియా అకౌంట్లలో తాను ఉగ్రవాద సంస్థలో చేరాలనుకుంటున్నట్లు పోస్ట్ చేశాడు. అయితే అదృశ్యమైన విద్యార్థిని హజోలో పట్టుకుని విచారిస్తున్నారు. 

విద్యార్థి తన ఈమెయిల్‌లో ఐసిస్‌లో చేరాలనుకుంటున్నట్లు పోస్ట్ చేశాడని పోలీసులు తెలిపారు. సోషల్‌ మీడియాలో పోస్ట్‌, ఈ మెయిల్‌ ద్వారా తన కోరికను వ్యక్తం చేసిన అతడు క్యాంపస్‌ నుంచి అదృశ్యమయ్యాడు. ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఎస్‌ పట్ల విధేయత చూపుతూ శనివారం లింక్డ్ఇన్‌తో పాటు ఈమెయిల్స్‌లో పోస్టులు పెట్టాడు.

అతన్ని పట్టుకుని ఎస్టీఎఫ్ కార్యాలయానికి తీసుకువచ్చారు. అతని నుంచి కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇస్లామిక్‌ స్టేట్‌ పట్ల విధేయత చూపుతూ అతడు చేసిన సోషల్‌ మీడియా పోస్టులు, ఈమెయిల్స్‌పై దర్యాప్తు చేస్తున్నట్లు అస్సాం స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు.

మరోవైపు బంగ్లాదేశ్‌ సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించిన ఐఎస్‌ఐఎస్‌ చీఫ్‌ హరీస్‌ ఫరూఖీ అలియాస్ హరీష్ అజ్మల్ ఫరూఖీ, అతడి అనుచరుడు అనురాగ్ సింగ్ అలియాస్ రెహాన్‌ను అస్సాంలోని ధుబ్రి జిల్లాలో అరెస్టు చేశారు. ఇది జరిగిన నాలుగు రోజులకే అదే ప్రాంతంలో ఐఐటీ విద్యార్థి సోషల్‌ మీడియా పోస్ట్‌, క్యాంపస్‌ నుంచి అతడు అదృశ్యం కావడం కలకలం రేపింది.

విద్యార్థి హాస్టల్ గదిలో ఐసిస్ మాదిరిగానే నల్లజెండా ఒకటి లభ్యమైందని పోలీసులు వివరించారు. అతను టెర్రరిస్టులతో కలిసి దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఐఈడీ బాంబులతో విధ్వంసానికి ప్రణాళికలు రచించినట్లు పోలీసులు చెప్పారు. ఐసిస్ అనేది అమెరికా, యూకే, ఈయూ, భారత్ తదితర దేశాలు నిషేధించిన ఉగ్రవాద సంస్థ.